317 జీవో అమలుతో సబ్జెక్టు టీచర్ల నియామకం
సీనియారిటీని బట్టి ఉపాధ్యాయుల కేటాయింపు
గందరగోళ పరిస్థితికి ఫుల్స్టాప్
పదోన్నతులకు మార్గం సుగమం
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, జనవరి 12 : రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో ప్రకారం చేసిన ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియతో కొన్నేండ్లగా నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యాయి. సంబంధిత జీవో అమలుతో కొత్త జిల్లాలు ఏర్పాటైన నాటి నుంచి కొనసాగుతున్న గందరగోళ పరిస్థితికి ఫుల్స్టాప్ పెట్టి పరిపాలన సౌలభ్యం కోసం ఏ ఒక్క ఉపాధ్యాయుడికీ అన్యాయం జరుగకుండా ఆయా జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించారు. ఉపాధ్యాయుల కేటాయింపుల్లోనూ ఎలాంటి పైరవీలకు తావులేకుండా సీనియారిటీ, ఇతర రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని అందరికీ న్యాయం జరిగేలా ప్రక్రియను పూర్తి చేశారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నేతలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప 317 జీవో అమలుతో మేలే జరిగిందంటున్నారు ఉపాధ్యాయులు. ప్రధానంగా ఎన్నో ఏండ్లుగా పాఠశాలల్లో వేధిస్తున్న అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయుల కొరత, అంతేకాకుండా గత కొన్నేండ్లుగా నోచని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు మార్గం సుగమం కావడంతోపాటు, కొత్త రిక్రూట్మెంట్కుగాను ఖాళీలపై పూర్తి స్పష్టత వచ్చింది. అంతేకాకుండా ఈ ప్రక్రియతో మారుమూల పల్లెల్లోని స్కూళ్లకు కూడా టీచర్లను కేటాయించారు.
జిల్లావ్యాప్తంగా 498 ఖాళీలు
గతంలో గణితం, భౌతికశాస్త్రం, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించి జిల్లాలోని పలు పాఠశాలల్లో టీచర్ల కొరత ఉండేది. 317 జీవో అమలుతో ఆ సమస్య తీరిపోయింది. జీవో ప్రకారం రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించడంతోపాటు ఇకపై కొత్త జిల్లాల ప్రకారమే పరిపాలనతోపాటు ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకోనున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల అలాట్మెంట్ ప్రక్రియతో ఖాళీల సంఖ్యపై కూడా పూర్తి స్పష్టత వచ్చింది. సీనియారిటీ మేరకు జిల్లాలో ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడంతో రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 498 ఉపాధ్యాయుల ఖాళీలున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు లెక్కతేల్చారు. సంబంధిత ఖాళీల్లో 300 ఎస్జీటీ(సెకండరీ గ్రేడ్ టీచర్స్) పోస్టులుకాగా, మిగతా పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఖాళీల సంఖ్యపై కూడా స్పష్టత వచ్చిన దృష్ట్యా త్వరలోనే ప్రభుత్వం ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
ఎంఈవోలుగా పదోన్నతులు
కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయుల విభజన పూర్తైన దృష్ట్యా.. ఇకపై ఆ దిశగానే బదిలీలుగానీ, పదోన్నతులుగానీ చేపట్టనున్నారు. కొత్త జిల్లాల ప్రకారం పదోన్నతులు చేపట్టినట్లయితే ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించనున్నారు. కోర్టు పరిధిలో ఉన్న ఎంఈవో పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు-జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించినట్లయితే మండల విద్యాధికారి పోస్టుల భర్తీతోపాటు అర్హులైన వారికి ఎంఈవోలుగా పదోన్నతులు లభించనున్నాయి.
ఆయా జిల్లాలకు కేటాయించబడిన ఉపాధ్యాయ పోస్టులు రంగారెడ్డికి 4085, మేడ్చల్కు 2780, వికారాబాద్కు 3397, మహబూబ్నగర్కు 375.. మొత్తం 10,637 ఉపాధ్యాయ పోస్టులు కేటాయించబడ్డాయి.