జగిత్యాల కలెక్టరేట్, అక్టోబర్ 11:నల్లటి తారు రోడ్డు.. స్వాగతం పలుకుతున్నట్లుగా ఇరువైపులా మూడు వరుసల్లో పచ్చటి మొక్కలు. వీటితో జగిత్యాల జిల్లాలోని ఏ మార్గం చూసినా పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారింది. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా చేపట్టిన మల్టీలేయర్ ప్లాంటేషన్ ప్రత్యేకతను సంతరించుకున్నది. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో మూడు వరుసల్లో 1.5 లక్షల మొక్కలు నాటి సంరక్షిస్తుండడంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
జిల్లాలో హరితహారం కార్యక్రమంలో కమ్యూనిటీ ప్లాంటేషన్, కాలనీ ప్లాంటేషన్, మియావాకి ప్లాంటేషన్, పల్లె ప్రకృతివనాలు, బృహత్ పల్లె ప్రకృతివనాలు వంటి వాటితో పాటు అవెన్యూ ప్లాంటేషన్ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని రోడ్లకు ఇరువైపులా అధికారులు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా 2020- 2021 సంవత్సరాల్లో మల్టీ లేయర్ ప్లాంటేషన్ కింద 1.58 లక్షల మొక్కలు నాటారు. రోడ్లకిరువైపులా నాటిన మొక్కలు నేడు తారు రోడ్డుకు పచ్చల హారం వేసినట్లుగా కనపడుతున్నాయి.
337కి.మీ.. లక్ష మొక్కలు
జిల్లాలో అంతర్భాగంగా ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారులు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు జిల్లాలో అధికారులు స్థలాలను గుర్తించారు. కార్యక్రమంలో భాగంగా తొలి విడుతలో జిల్లాలోని పలు విభాగాలకు చెందిన రోడ్లకు ఇరువైపులా 57,140 మొక్కలను నాటారు. రెండో విడుతలో భాగంగా జగిత్యాల జిల్లాలో 250కి.మీ. మేర రోడ్లకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు నాటాలని జిల్లాకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులోభాగంగా జిల్లాలో ఉన్న 72కి.మీ. జాతీయ రహదారి, 35కి.మీ. రాష్ట్ర రహదారి, 184కి.మీ. ఆర్అండ్బీ రహదారి, 46కి.మీ. పంచాయతీరాజ్ రోడ్లు మొత్తం 337కి.మీ. మేర రోడ్లకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు నాటేందుకు కలెక్టర్ జీ రవి ఆధ్వర్యంలో అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు ఈజీఎస్ ఆధ్వర్యంలో జూన్ నుంచి గుంతలు తీసి 1,00,285 మొక్కలను నాటారు. అత్యధికంగా వెల్గటూర్, ధర్మపురి, జగిత్యాల రూరల్ మండలాల్లో పదివేల చొప్పున, మల్లాపూర్ మండలంలో 12వేల మొక్కలు నాటారు. అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లోని రోడ్లపై 2018-19లో 79,789 మొక్కలు, 2019-20లో 3,71,699 మొక్కలు, 2020-21 సంవత్సరంలో 2,04,355మొక్కలు నాటారు. మూడు వరుసల్లోని రోడ్డువైపు ఉన్న మొదటి వరుసలో తక్కువ ఎత్తు పెరిగే పూల మొక్కలు, మధ్యన మధ్యస్థంగా ఎత్తు పెరిగే మొక్కలు, చివరి వరుసలో భారీగా పెరిగే వేప, చింత వంటి మొక్కలు నాటుతున్నారు. ఇలా నాటే మొక్కలతో రోడ్లపై జరిగే ప్రమాదాల వల్ల జరిగే నష్ట తీవ్రతను సైతం తగ్గించే అవకాశం ఉంటుందని రోడ్డు భద్రతా నిపుణులు పేర్కొంటున్నారు.
133 శాతం లక్ష్య సాధనతో రాష్ట్రంలో అగ్రభాగాన జిల్లా
మల్టీలేయర్ ప్లాంటేషన్లో జగిత్యాల జిల్లా నిర్దేశించిన లక్ష్యాన్ని మించి 133శాతంతో రాష్ట్రంలో ముందంజలో ఉంది. జగిత్యాల జిల్లాకు 250కి.మీ. మేర రోడ్లకు మల్టీ లేయర్ ప్లాంటేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. సవాలుగా తీసుకున్న కలెక్టర్ జి.రవి లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి హరిత హారం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించారు. గుంతలు తవ్వించడం, మొక్కలు నాట డం వంటి వాటిపై కలెక్టర్ స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో టార్గెట్ను మించి 133శాతం అదనంగా మొక్కలు నాటింపజేశారు. మల్టీలేయర్ ప్లాంటేషన్లో జగిత్యాల జిల్లా రాష్ట్రంలో ముందంజలో నిలిచింది.
నాటడమే కాదు.. సంరక్షణ బాధ్యత కూడా
మొక్కలు నాటడమే కాకుండా నాటిన వాటిని సైతం సంరక్షిస్తున్నారు. మల్టీలేయర్ ప్లాంటేషన్ ద్వారా నాటిన మొక్కలను మూడు సంవత్సరాల పాటు సంరక్షించనున్నారు. దీనికనుగుణంగా ప్రతీ 400 మొక్కలకు ఒక వాచ్ అండ్ వాచర్ను నియమించి నీళ్లు పోయడం, ట్రీ గార్డులు ఏర్పాటు చేయడం, నిర్వహణ, మొక్కలకు సపోర్ట్ కర్రల నిర్వహణను చేయిస్తున్నారు. వాచ్ అండ్ వాచర్ల పనితీరు, మొక్కల సంరక్షణను డీఆర్డీఏ అధికారులు, మండ ల, గ్రామ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గ్రామ స్థాయిలో హరిత రక్షక దళాలను ఏర్పా టు చేసి మొక్కల రక్షణ బాధ్యతను చూస్తున్నారు. దీంతో మొదటి, రెండు విడుతల్లో నాటిన మూడు వరుసల మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి.