పోలీసులకు ప్రజలు సహకరించాలి
సీపీ కమలాసన్రెడ్డి
రాంనగర్, జూన్ 11: కమిషనరేట్ వ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కేసు నమోదు చేస్తామని సీపీ కమలాసన్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు పోలీసులు నగర, పట్టణ ప్రాంతాలపై దృష్టికేంద్రీకరించి పకడ్బందీ చర్యలు చేపట్టడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్లు తెలిపారు. సెకండ్ వేవ్లో కుటుంబాలకు కుటుంబాలే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలను గుర్తించి అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు తమ దరికి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి రేయింబవళ్లు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు తమవంతు సహకారం అందించాలని కోరారు. గతేడాది లాక్డౌన్లో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఉల్లంఘనలకు పాల్పడేవారు ఎంతటి వారైనా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
3715 వాహనాలు స్వాధీనం
కమిషనరేట్ వ్యాప్తంగా గతనెల 12వ తేదీ నుంచి శుక్రవారం వరకు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 11,283 కేసులు నమోదు చేసినట్లు సీపీ కమలాసన్రెడ్డి తెలిపారు. ఇందులో మాస్క్ ధరించని 4,681 మందిపై, భౌతిక దూరం పాటించని 1162, ఎకువ మొత్తంలో జనం గుమిగూడి ఉండడం 364, లాక్డౌన్ ఉల్లంఘనకు పాల్పడిన 4918 మందిపై, అక్రమ కార్యకలాపాలకు సంబంధించి 140 కేసుల్లో 237మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇతర రకాల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 18 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. లాక్డౌన్ సమయాల్లో అనవసరంగా వాహనాలపై రోడ్లపైకి వచ్చిన 3715 మంది వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
నిషేధాజ్ఞలు కొనసాగింపు
సాధారణ పౌరులు, మహిళలు ఎదురొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈనెల 24 వరకు పొడిగించినట్లు సీపీ కమలాసన్రెడ్డి తెలిపారు. తాగి వీధుల్లో, రోడ్లపై అసభ్య పదజాలంతో మాట్లాడడం, అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని, వారి ఆగడాలకు కల్లెం వేయడంతో పాటు ప్రజల భద్రత, రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలపరిమితి పొడిగించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే, కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను సైతం ఈనెల 24 వరకు పొడిగించినట్లు తెలిపారు. వివిధ కార్యక్రమాల నిర్వహణకు మైకులు వినియోగిస్తే ఏసీపీల అనుమతి తీసుకోవాలన్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించే వారిపై ఐపీసీ 188, హైదరాబాద్ నగర పోలీసు చట్టం, ఫసలీ నిబంధనలనుసరించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.