రైతుల వారీగా సర్వే నంబర్, సాగు విస్తీర్ణం, విత్తన రకం, ప్రధాన పంట, అంతర పంట, నీటి వసతి వివరాలను సేకరిస్తున్న అధికారులు
పంట కొనుగోలు సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 13,301 ఎకరాల సమాచారం ఆన్లైన్లో నమోదు
రంగారెడ్డి, జనవరి 11, (నమస్తే తెలంగాణ): అన్నదాతల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పంటల కొనుగోళ్లల్లోనూ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా పంటల వివరాలను సేకరిస్తున్నది. ఈ యాసంగి సీజన్లో రైతు ఏ సర్వే నంబర్ భూమిలో ఏ పంట సాగు చేశాడు.. విస్తీర్ణమెంత.. విత్తన రకమేందీ.. ప్రధాన పంటా.. అంతర పంటా.. బోరుబావా.. బావినా.. చెరువు కింద.. లేదంటే వర్షాధారమా.. అన్న వివరాలను అధికారులు సేకరించి ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు జిల్లాలో 13,301 ఎకరాల్లో పంటల వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రతి రైతు పంటల వివరాలను నమోదు చేయించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
ప్రభుత్వ అదేశాల మేరకు యాసంగి సీజన్లో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ గతేడాది నుంచి కొనసాగుతున్నది. జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు పర్యటిస్తూ రైతుల వారీగా సాగు విస్తీర్ణం వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. రైతుల వారీగా సర్వే నంబర్, సాగు విస్తీర్ణంతోపాటు చేసిన పంట, విత్తన రకం, ప్రధాన పంట, అంతర పంట, నీటి వసతి వివరాలతోపాటు రైతుల సంతకాలను సేకరిస్తున్నారు. అదేవిధంగా భూమి యజమాని ఫోన్ నెంబర్ తదితర వివరాలను మరో యూనిట్గా తీసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రైతులు పండించే పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం వల్ల కొనుగోలు విషయంలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాను ముందస్తు చర్యల్లో భాగంగా పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియకు ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా పంటల వివరాల సేకరణలో భాగంగా నీటి ఆధారాలైన బోరు, బావులు, చెరువుల ద్వారా పారే వివరాలను, రైతులు సాగు చేస్తున్న పంటల ద్వారా రానున్న దిగుబడి వివరాలను కూడా అంచనా వేస్తున్నారు.
13,301 ఎకరాల వివరాలు నమోదు..
జిల్లాలో పంటల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 13,301 ఎకరాల వివరాలను వ్యవసాయాధికారులు ఆన్లైన్లో పొందుపర్చారు. పంట దిగుబడి సమయంలో సేకరణ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆన్లైన్లో పంటల వివరాలను నమోదు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అంతేకాకుండా పంటల వివరాలను నమోదు చేయని రైతుల వద్ద కొనుగోలు సేకరణ కూడా ఇబ్బంది మారనున్న దృష్ట్యా ప్రతి ఒక్క రైతు తాను సాగు చేసే పంటల వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు చేవెళ్ల మండలంలో 917 ఎకరాలు, మొయినాబాద్లో 54, షాబాద్లో 1377, శంకర్పల్లి మండలంలో 1194, అబ్దుల్లాపూర్మెట్లో 53, ఇబ్రహీంపట్నంలో 7, మాడ్గులలో 723, మంచాల మండలంలో 29, యాచారంలో 46, ఆమనగల్లో 1068, బాలాపూర్లో 8, కడ్తాల్లో 612, కందుకూరులో 53, మహేశ్వరంలో 171, గండిపేటలో 7, రాజేంద్రనగర్లో 60, శంషాబాద్లో 12, ఫరూఖ్నగర్లో 305, చౌదరిగూడెంలో 850, కేశంపేటలో 822, కొందుర్గులో 714, కొత్తూరులో 122, నందిగామలో 69, తలకొండపల్లిలో 4019 ఎకరాల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు ఆన్లైన్లో పొందుపర్చారు.
వారం రోజుల్లో పూర్తవుతుంది
వారం రోజుల్లోగా ఆన్లైన్లో పంటల వివరాల నమోదు ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. జిల్లావ్యాప్తంగా ప్రతి రైతు వివరాలను సేకరిస్తున్నాం. రైతులు కూడా ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా సాగు చేసే తమ పంటల వివరాలను స్థానిక వ్యవసాయాధికారుల వద్దకు వెళ్లి నమోదు చేసుకోవాలి. పంట కొనుగోలు సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో పంటల వివరాలను నమోదు చేసుకోవాలి.