పరిగి, జనవరి 11 : ప్రజారోగ్యమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం వైద్య సేవలను మెరుగుపరుస్తున్నది. జిల్లాలోని కొడంగల్ సీహెచ్సీ ఇటీవలే వైద్య విధాన పరిషత్ పరిధిలోకి మారగా, పరిగి దవాఖానను సైతం వైద్య విధాన పరిషత్లోకి మార్చుతూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దవాఖానలో సిబ్బంది, వైద్యుల పోస్టులు పెరుగనున్నాయి. పరిగి ప్రాంత ప్రజలకు విస్తృత సేవలు అందించేందుకు రూ.5కోట్లతో నూతన భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం రోజుకు 150 నుంచి 200 వరకు ఔట్ పేషెంట్లు వస్తుండగా, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. దవాఖానలో సకల సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పరిగి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. అంతేకాకుండా పరిగి దవాఖానలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటయ్యేలా కృషి చేస్తానని మంగళవారం ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి వెల్లడించారు.
జిల్లాలోని పరిగి క్లస్టర్ హెల్త్ సెంటర్ వైద్య విధాన పరిషత్లోకి వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇటీవలె విడుదలయ్యాయి. వికారాబాద్ జిల్లా పరిధిలో ఇటీవల కొడంగల్ సీహెచ్సీ సైతం వైద్య విధాన పరిషత్ పరిధిలోకి మారింది. తద్వారా పరిగి, కొడంగల్ సీహెచ్సీలు రెండు దవాఖానలకు వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేయనున్నాయి. పరిగిలో ఇటీవల నూతన దవాఖాన భవనం నిర్మాణం చేపట్టడంతో సదుపాయాలు మెరుగవగా వైద్య విధాన పరిషత్ పరిధిలోకి మార్పు ద్వారా మరికొన్ని వైద్యుల పోస్టులు మంజూరు కానున్నాయి. పరిగి దవాఖానలో ముగ్గురు వైద్యులు పనిచేస్తున్నారు. ఒకరు రెగ్యులర్ డాక్టర్, మరొకరు డెంటల్ వైద్యుడు, ఇంకొకరు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోకి వెళ్లడం ద్వారా సుమారు పది మంది కొత్తగా డాక్టర్ల నియామకం జరుగనున్నది. పరిగి దవాఖానలో ప్రస్తుతం రోజుకు 150 నుంచి 200 వరకు ఔట్ పేషెంట్లు వైద్యం పొందుతున్నారు. ఏదైనా అత్యవసర వైద్యం కోసం వికారాబాద్ లేదంటే హైదరాబాద్లోని దవాఖానలకు రెఫర్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది.
పెరుగనున్న వైద్యులు, సిబ్బంది పోస్టులు
పరిగి దవాఖాన వైద్య విధాన పరిషత్ పరిధిలోకి మార్పు చేయడం ద్వారా ప్రధానంగా డాక్టర్లు, ఇతర సిబ్బంది పోస్టులు పెరుగనున్నాయి. ప్రధానంగా గైనకాలజిస్ట్లు, చిల్డ్రన్స్ స్పెషలిస్ట్, అనస్తీషియిస్, జనరల్ ఫిజిషియన్ ఎండీ, ఆర్థో స్పెషలిస్ట్, ఈఎన్టీ, కంటి వైద్యుల నియామకం సైతం జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న వైద్య సేవలకు, రాబోయే రోజుల్లో అందే వైద్య సేవలకు చాలా వ్యత్యాసం ఉండనున్నది. గైనకాలజిస్ట్లు, చిల్డ్రన్స్ స్పెషలిస్ట్లు, అనస్తీషియిస్ట్ నియామకాల ద్వారా దవాఖానల్లో ప్రసవాలు, సిజేరియన్లు సైతం జరుగుతాయి. చిన్న పిల్లలకు ఏదైనా అత్యవసర సేవలు అవసరమైనా వైద్యులు అందుబాటులో ఉంటారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్ట్లు, ఇతర సిబ్బంది సంఖ్య సైతం పెరుగడంతో మరిన్ని వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ సైతం ఇక్కడే చేసే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఏదైనా అత్యవసర చికిత్స కోసం చాలావరకు హైదరాబాద్కు తరలిస్తున్నారు. వైద్యులు నియామకమైతే ఇక్కడే చాలావరకు వైద్యసేవలు అందుబాటులో ఉంటాయి. తద్వారా పేదలకు మరిన్ని నాణ్యమైన సేవలు అందనున్నాయి.
రూ.5కోట్లతో భవనం, సదుపాయాలు
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5కోట్లు వెచ్చించి 50 పడకల నూతన దవాఖాన భవనాన్ని నిర్మించారు. గత ఏడాది ఈ నూతన భవనం ప్రారంభోత్సవం జరుగగా కొత్త భవనంలోనే వైద్యసేవలు అందిస్తున్నారు. నూతన భవనంలో ప్రత్యేకంగా బెడ్స్తోపాటు ఇతర వైద్య పరికరాలు, ఇతర సదుపాయాలు కల్పించారు. తద్వారా అధునాతన, నాణ్యమైన వైద్యం అందించేందుకు ఇప్పటికే అన్ని సదుపాయాలు పరిగి దవాఖానలో ఏర్పాటు చేశారు. అన్ని వసతులతో కూడిన భవనం ఉండగా, వైద్య విధాన పరిషత్ ద్వారా కొత్తగా వైద్యుల నియామకం చేపడితే అన్ని రకాల సేవలు ఉచితంగా పేదలకు అందుతాయి. ప్రత్యేకంగా వైద్య నిపుణుల నియామకం చేపడితే వారి ద్వారా గ్రామీణ ప్రాంతంలోని పేదలకు అనేక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల వైద్య విధాన పరిషత్లోకి మారుస్తూ ఉత్తర్వులు వెలువడగా త్వరలోనే దవాఖానను అధికారికంగా మార్పు చేసేందుకు సంబంధించిన పత్రాలు జిల్లా వైద్యాధికారి అందజేయనున్నారు. ఆ వెనువెంటనే మిగతా కార్యక్రమాలు కొనసాగుతాయి. పరిగి దవాఖాన వైద్య విధాన పరిషత్ పరిధిలోకి వెళ్లడం ద్వారా వైద్యులు, వైద్య సిబ్బంది సంఖ్య పెరగడం, సదుపాయాలు మరిన్ని విస్తరించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మేలైన సేవలు అందుతాయి.
విస్తరించనున్న సేవలు