పంట మార్పిడికి ముందుకొస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు
ఇప్పటికే మోయినికుంట, మొర్రాయిపల్లెలో ఏకగ్రీవ తీర్మానం
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం కొర్రీలు పెడుతుండడంతో రాష్ట్ర సర్కారు అన్నదాతలను ప్రత్యామ్నాయ పంటల వైపు మరల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. యాసంగిలో వరి వేయవద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగుతో మార్పు తెస్తామంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు ముందుకొస్తున్నారు. పంట మార్పిడి చేసి రాష్ర్టానికే జిల్లాను ఆదర్శంగా నిలుపుతామంటూ పలు గ్రామాల రైతులు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. పామాయిల్, పొద్దుతిరుగుడు, సోయాబీన్, శనగ తదితర కొత్త రకం పంటల సాగుపై అవగాహన కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ముస్తాబాద్ మండలంలోని మోయినికుంట, మొర్రాయిపల్లె గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు కొత్త పంటల సాగుకోసం ప్రణాళికలు తయారు చేసుకుంటుండగా, ఇతర మండలాల రైతులు అదే బాటలో అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
సత్ఫలితాలిస్తున్న సదస్సులు
పంట మార్పిడిపై ప్రభుత్వం నిర్వహించిన అవగాహన సదస్సులు సత్ఫలితాలిస్తున్నాయి. ఆగస్టు 20న సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పంట మార్పిడి అవగాహన సదస్సులో జిల్లాలోని ప్రజాప్రతినిధులకు మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాల్లో సదస్సులు పెట్టి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆమాత్యుడి సూచన మేరకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు అదే నెల 21 నుంచి 30వరకు సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సులు రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో శ్రీకారం చుట్టారు. మంత్రి పిలుపునకు స్పందించిన పలు మండలాల్లోని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేస్తామంటూ ముందుకొస్తున్నారు. ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లె, మోహినికుంట గ్రామాలకు చెందిన రైతులు మార్పు తెస్తామంటూ ముందుకొచ్చారు. ముస్తాబాద్ మండల రైతు బంధు సమితి కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్రావు అధ్యక్షతన గత నెలలో గ్రామ సభలు పెట్టుకున్నారు. యాసంగిలో వరి వేయకుండా, కొత్త పంటలు సాగు చేస్తామని ప్రత్యేక తీర్మానం చేశారు. శనగ, పొద్దుతిరుగుడు, ఆయిల్ఫాం, నువ్వులు, పల్లి, ఇతర పంటల సాగు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం వానకాలం పంట కోతకు వచ్చి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాల్సి ఉంది. ధాన్యం అమ్మిన తర్వాత కొత్తల పంటల సాగుపై అవగాహన కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కోనరావుపేట, ఇల్లంతకుంట, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేటతో పాటు ఇతర మండలాల్లోని రైతులు సైతం కొత్త పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
పంట మార్పిడితో అధిక లాభాలు
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొంటలేనందున రైతులు అనేక కష్టాలెదుర్కొంటున్నరు. కొత్త రకం పంటలు వేయాలని రైతుబంధు సమితి కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్రావు ఆధ్వర్యంలో రైతులమంతా మీటింగ్ పెట్టుకుని తీర్మానం చేసుకున్నం. పంటలపై అవగాహన కల్పించేందుకు త్వరలో స్టడీటూర్కు తీసుకెళ్తున్నం. పొద్దుతిరుగుడు, నువ్వులు, మిర్చి, ఆయిల్పాం ఇంకా కొత్తరకం పంటలు సాగు చేయాలనుకుంటున్నం.