అభివృద్ధికి అందరూ సహకరించాలి
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
ఇబ్రహీంపట్నం, జనవరి 10 : నూతన సంవత్సరంలో నియోజకవర్గ అభివృద్ధియే ప్రధాన ఎజెండాగా తీసుకుని ముందుకెళ్తామని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై పాలకవర్గంతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 17 లేదా 18 తేదీల్లో ఈ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ముందుగా తుర్కయాంజాల్ మున్సిపాలిటి పరిధిలో రూ.2కోట్లతో మాసాబ్చెరువు సుందరీకరణ పనులు పూర్తైనందున వాటిని ప్రారంభిస్తామని, తుర్కయాంజాల్ చెరువుకట్టకింద రూ.4.50కోట్లతో కూరగాయలు, మాంసం విక్రయాల మార్కెట్కు శంకుస్థాపన, రాగన్నగూడ సమీపంలో రూ.92 కోట్లతో వాటర్గ్రిడ్ పనులు, మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీమెగా టౌన్షిప్లో రూ.5.20కోట్లతో సీసీరోడ్ల నిర్మాణ పనులు, ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని గ్రామాలకు సుమారు రూ.18 కోట్లతో తాగునీరు అందించే వాటర్గ్రిడ్ పనులకు, ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న ఆదిబట్ల – కొంగర గ్రామాల మధ్యన రూ. 3 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణ పనులకు, ఇబ్రహీంపట్నం చెరువుకట్టనుంచి బీడీఎల్ వరకు రూ.18కోట్లతో వందఫీట్ల రోడ్డును, రూ.1.25కోట్లతో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం నూతన భవనం నిర్మాణానికి శంకుస్థాపన, రూ.1.50కోట్లతో ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో రూ.4 కోట్లతో స్టేడియం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారని అన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కమిషనర్ యూసఫ్, కౌన్సిలర్లు సుల్తాన్, కొండ్రు శ్రీలత, నల్లబోలు మమత, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం
టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రాయపోల్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త షేక్ సత్తర్, అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని లష్కర్గూడ గ్రామానికి చెందిన దోతి నాగరాజులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారు పార్టీ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా టీఆర్ఎస్ అదిష్టానం ప్రమాదబీమా కింద రూ.2లక్షల చొప్పున ఇద్దరికి రూ.4లక్షలు విడుదల చేసింది. ఆ చెక్కులను సోమవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కార్యదర్శి భాస్కర్రెడ్డి, సర్పంచ్లు బల్వంత్రెడ్డి, పారిజాత, ఎంపీటీసీలు శ్రీశైలం, టీఆర్ఎస్ అబ్దుల్లాపూర్మెట్ మండలఅధ్యక్షుడు కిషన్గౌడ్ నాయకులు బాలుగౌడ్, అశోక్గౌడ్ తదితరులున్నారు.
కాశీంగుట్ట ప్లాట్లకు లైన్ క్లియర్!
తుర్కయాంజాల్, జనవరి 10 : ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న కాశీంగుట్ట ప్లాట్లకు లైన్ క్లియర్ అయ్యింది. నిరుపేద దళితులు ఇండ్లు కట్టుకునేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడుతాని ఎమ్మెల్యే హామీ ఇవ్వటంతో దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి 10వ వార్డులో ఉన్న కాశీంగుట్టలో సుమారు ఎకరంన్నర భూమి ఉంది. ఇందులో స్థానిక దళితులు ఎన్నో ఏండ్లుగా కబ్జాలో ఉంటుండగా 2006లో ప్రభుత్వం తీసుకువచ్చిన 58 జీవో కింద ఇంటి నిర్మాణాలు ఉన్న కొంత మందికి అధికారులు రెగ్యులరైజేషన్ చేశారు. దీంతో ఇంటి నిర్మాణం లేని వారు కబ్జాలో ఉన్నప్పటికీ నిర్మాణానికి అధికారులు అనుమతికి నిరాకరించారు. అప్పటి నుంచి కాశీంగుట్ట ప్లాట్ల సమస్య పెండింగ్లో ఉంది. డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ఆధ్వర్యంలో దళితులు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్డీవో వెంకటాచారి, అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ వెంకటేశ్వర్లుతో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈ సమస్య పై చర్చించారు. కాశీంగుట్టలో నిరుపేద దళితులు ఇండ్లు కట్టుకునేందుకు అనుమతివ్వాలని ఎమ్మెల్యేను అభ్యర్థించారు. ఈ విషయం తన దృష్టిలో ఉందని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సమావేశంలో కౌన్సిలర్ మేతరి అనురాదదర్శన్, మాజీ సర్పంచ్లు కందాడ లక్ష్మారెడ్డి, మేతరి అంజయ్య, నాయకులు గుండా ధన్రాజ్, పుల్లగుర్రం విజయానందర్ రెడ్డి, మేతరి అశోక్, మేతరి శంకర్, మేతరి స్వామి, చెక్క బాలనర్సింహ, చెక్క మల్లయ్య, మైలారం బాబు, చెక్క సుధాకర్, కొమ్మని దయానంద్, మేతరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.