పనులను పరిశీలించిన మార్కెటింగ్ శాఖ
అదనపు సంచాలకుడు లక్ష్మణుడు
అబ్దుల్లాపూర్మెట్, జనవరి 10 : రాబోయే మామిడి, మోసంబి సీజన్లో రైతుల సౌకర్యార్థం బాటసింగారం తాత్కాలిక పండ్ల మార్కెట్లో షెడ్లు నిర్మాణం చేస్తున్నామని మార్కెటింగ్శాఖ అదనపు సంచాలకుడు లక్ష్మణుడు తెలిపారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం లాజిస్టిక్ పార్కులోని గడ్డిఅన్నారం తాత్కాలిక మార్కెట్లో నిర్మిస్తున్న షెడ్ల నిర్మాణ పనులను ఆయన సోమవారం ఇతర అధికారులతో కలిసి పరిశీలిచారు. ఈ సందర్భంగా లక్ష్మణుడు.. మాట్లాడుతూ తాత్కాలికంగా బాటసింగారంలోని 11ఎకరాల్లో నెలకొల్పిన పండ్ల మార్కెట్లో దసరా నుంచి కొనుగోళ్లు ప్రారంభించామని తెలిపారు. కొహెడలో పూర్తిస్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్ నిర్మాణం జరిగే వరకు బాటసింగారంలోనే పండ్ల మార్కెట్ నిర్వహించనున్నామని తెలిపారు. ఇక్కడికి వచ్చే రైతులు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం అతిపెద్ద విస్తీర్ణంలో ఉన్న షెడ్లలో వ్యాపారం సాగిస్తున్నామన్నారు. ఈ సీజన్లో మామిడి, మోసంబి, వాటర్ మిలాన్ దిగుబడి అధికంగా రానుందని తెలిపారు. అందులో భాగంగా ముందుస్తుగా అదనంగా షెడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు.
రైతులు, వ్యాపారస్తుల సౌకర్యార్థం సమీపంలోని ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన 5 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా మరో 5 ఎకరాలను సైతం మార్కెట్ నిర్వహణ సౌలభ్యం కోసం లాజిస్టిక్ పార్కులోనే తీసుకునేందుకు చర్చిస్తున్నామని వివరించారు. పండ్ల వ్యాపారులు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బాటసింగారం తాత్కాలిక మార్కెట్ అవుటర్కు చేరువలో ఆహ్లాదకర వాతావరణంలో ఉందన్నారు. అవుటర్ సమీపంలో ఉండడంతో తెలంగాణలోని ఏ ప్రాంతం నుంచి అయినా సులువుగా బాటసింగారానికి చేరుకోవచ్చని తెలిపారు. పండ్లు పండించే రైతులకు సౌకర్యాలు కల్పించడంతోపాటు వర్తకులకు ఇబ్బందులు కలుగకుండా చూసే బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉందన్నారు.
పండ్ల మార్కెట్కు రూ.50లక్షలతో రోడ్డు నిర్మాణం
కొహెడ మార్కెట్కు రోడ్డు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం రూ.50లక్షలు కేటాయించిందని తెలిపారు. సంఘీకి వెళ్లే రోడ్డు నుంచి మార్కెట్కు వెళ్లే మార్గంలో నూతన రోడ్డు నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి కూడా మార్కెట్కు లింక్రోడ్డు ఉంటుందన్నారు. మార్కెట్లోకి వచ్చే వాహనాలతో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. మాస్టర్ ప్లానింగ్ ప్రభుత్వం నుంచి రాగానే మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ నిర్మాణం చేసేందుకు మార్కెటింగ్ శాఖ సన్నద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్ఈ, అడ్వైజర్ ఉమామహేశ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాధాకృష్ణమూర్తి, మార్కెటింగ్ ఎలక్ట్రికల్ డీఈఈ సురేందర్రెడ్డి, ఇన్చార్జి కార్యదర్శి చిలుక నర్సింహారెడ్డి, ఇతర సిబ్బంది ఉన్నారు.