గణపురం, డిసెంబర్ 8 : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న విద్యు త్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ బుధవారం కేటీపీపీ ప్రధాన గేటు ఎదుట నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీతో పాటు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏ సీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉద్యోగులు, ఇంజినీర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీపీపీ ఉద్యోగులు మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న విద్యుత్ సవరణ బిల్లు 2021ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉద్యోగులంతా ఏకమై సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. బిల్లు ద్వారా 70 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తున్న విద్యుత్ పంపిణీ సంస్థలు దేశంలోని 25 కోట్ల వినియోగదారులు, పరిశ్రమ వర్గాలపై విద్యుత్ భారం మోపనుందన్నారు. పీఎం మోదీ కార్పొరేట్ సంస్థలకు విద్యుత్ రంగాన్ని అప్పగించి ప్రైవేట్ పరం చేయాలని చేస్తున్నట్లు విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం సరికాదన్నారు. తెలంగాణలోని సుమారు 50 వేల మంది విద్యుత్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోని పక్షంలో రైతులతో పాటు అన్ని వర్గాలను కలుపుకొని సమ్మె చేస్తామని నేషనల్ కొఆర్డినేషన్ కమిటీ, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.