పోడు భూములు సమస్య పరిష్కరిస్తాం
అర్హుల గుర్తింపులో అన్ని పార్టీలు భాగస్వామ్యం కావాలి
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
భువనగిరి కలెక్టరేట్, నవంబర్8: పోడు భూముల సమస్య పరిష్కారానికి అందరి సహకారం తప్పనిసరి అని, అదే సమయంలో అడవుల పెంపకంపై ప్రతి ఒక్కరూ ముందడుగు వేసినప్పుడే రాబోయే తరాలకు వెలకట్టలేని సంపదను అందించినవారమవుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అడవుల సంరక్షణ, పోడు భూములపై కలెక్టర్ పమేలాసత్పతి అధ్యక్షతన సోమవారం భువనగిరిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా ధిగా హాజరై మాట్లాడుతూ చౌటుప్పల్, తుర్కపల్లి, సంస్థాన్నారాయణపూర్ మండలాల్లో 1,318 ఎకరాల్లో పోడు వ్యవసాయం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న అర్హులందరికీ ప్రభుత్వం హక్కులు కల్పిస్తుందని స్పష్టం చేశారు. గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు, ఫిర్యాదులు స్వీకరించాలని, అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్హులకు న్యాయం జరిగేందుకు అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో పని చేయాలని కోరారు.
పోడు భూముల సమస్య పరిష్కారానికి అందరి సహకారం తప్పనిసరి అని, అడవుల పెంపకంపై ప్రతిఒక్కరూ ముందడుగు వేసినప్పుడే రాబోయే తరాలకు వెలకట్టలేని సంపదను అందించిన వారమవుతామని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అడవుల సంరక్షణ, పోడుభూములపై అఖిలపక్ష నాయకులతో పట్టణ పరిధిలోని వివేరా హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అడవుల రక్షణ కోసం ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా, మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించేలా చూడాలన్నారు. గిరిజన, గిరిజనేతరులు పోడుభూములను సాగు చేసుకుంటూ, అడవులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, అట్టి భూముల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం రూపొందించడం జరిగిందన్నారు. అందులో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ హక్కులు కల్పించాలన్నారు. ఈక్రమంలో అటవీ భూములను కాపాడుకుంటూ ముందడుగు వేయాలన్నారు. పోడు భూముల సాగుపై రాష్ట్ర వ్యాప్తంగా 6లక్షల దరఖాస్తులు అందాయని అందులో భాగంగా 2.90లక్షల ఎకరాలకు హక్కు పత్రాలను అందించామన్నారు.
జిల్లాలో 8,04,300ఎకరాల భూమిలో 29,531ఎకరాల అటవీ భూమి ఉందన్నారు. జిల్లాలోని చౌటుప్పల్, తుర్కపల్లి, సంస్థాన్నారాయణపూర్ మండలాలకు సంబంధించి ఎనిమిది గ్రామాల్లో 1318ఎకరాల పోడుభూమి ఉన్నట్లు గుర్తించామని, 326మంది ఎస్టీలకు సంబంధించి 702ఎకరాలు, 57మంది ఎస్సీలకు సంబంధించి 127ఎకరాలు, ఇతరులు 159మందికి 489ఎకరాల భూములకు సంబంధించి హక్కుపత్రాలు ఇవ్వాల్సి ఉందని అట్టి వాటి కోసం ఆయా గ్రామాల్లో గ్రామసభలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. వచ్చిన ఫిర్యాదులపై గ్రామ, డివిజన్, జిలా ్లకమిటీల పరిశీలనలో పరిష్కరిస్తామన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. కలెక్టర్ పమేలాసత్పతి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, అదనపు కలెక్టర్లు దీపక్తివారీ, శ్రీనివాస్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, ఆర్డీఓలు భూపాల్రెడ్డి, సూరజ్కుమార్, జిల్లా అటవీ శాఖాధికారి వెంకటేశ్వర్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖాధికారి మంగ్తానాయక్, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్చైర్మన్లు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.