బాధితులకు సీఎంఆర్ఎఫ్ అండ
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల, ఆగస్టు 7: రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ సర్కారు ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు, దామెర, గీసుకొండ, సంగెం, ఖిలా వరంగల్ మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు శనివారం హన్మకొండలోని తన నివాసంలో రూ. 11.34 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అనారోగ్యం బారిన పడి ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందుతూ ఆర్థికంగా కుదేలైన కుటుంబాలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కేసీఆర్ ఆదుకుంటున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో ప్రైవేట్ వైద్యశాలకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో అధునాతన సౌకర్యాలతో సూపర్స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలు తయారు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
పరకాల మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకుడు ఇనుగాల రమేశ్ తల్లి అంకూసమ్మ ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే ధర్మారెడ్డి పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ మొగిలి, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన పరకాల ఏసీపీ
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఏసీపీ జూపల్లి శివరామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల పరకాల ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన శివరామయ్య హన్మకొండలోని చల్లా నివాసంలో కలిసి డివిజన్ పరిధిలో శాంతి భద్రతలపై చర్చించినట్లు తెలిపారు.