వేములవాడకు పచ్చల హారం
మూడేళ్ల క్రితం నాటిన మొక్కలు.. నేడు ఏపుగా పెరిగి
రహదారులన్నీ హరితమయం
ఎవెన్యూ ప్లాంటేషన్తో కళకళలాడుతున్న బైపాస్ రోడ్లు
వేములవాడ, అక్టోబర్ 6: హరితహారంతో వేములవాడ రాజన్న క్షేత్రానికి వచ్చే రహదారులన్నీ హరితశోభితమయ్యాయి. పచ్చదనంతో సాదర స్వాగతం పలుకుతున్నాయి. వేములవాడ పట్టణానికి అనుసంధానంగా ఉన్న నందికమాన్ నుంచి తిప్పాపూర్ వరకు నిర్మించిన డివైడర్ మధ్యలో రోడ్డుకు ఇరువైపులా పూల మొక్కలు పెట్టారు. అలాగే పట్టణంలోని మొదటి, రెండో బైపాస్ రోడ్లు సాయిరక్ష జంక్షన్ నుంచి చెక్కపల్లి జంక్షన్, కోనాయపల్లి రోడ్డు, మల్లారం రహదారులను కలుపుతూ ఉన్న రోడ్లలో 2018లో నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి పచ్చదనాన్ని పంచుతున్నాయి. పట్టణ ప్రజలతో పాటు రాజన్న క్షేత్రానికి వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. సుమారు 10వేల మొక్కలు వృక్షాలుగా ఎదగడంతో వేములవాడ రహదారులు పచ్చలహారాన్ని తొడుగుకున్నాయి. మొదట్లో అటవీ, మండల పరిషత్, పురపాలక సంఘంతో కలిసి ఇతర విభాగాలు మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు చూసేది. ప్రసుత్తం పురపాలక సంఘం ఆధ్వర్యంలో సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నామని కమిషనర్ శ్యాంసుందర్రావు తెలిపారు. ఇక పట్టణంలోనూ భగవంతరావునగర్, కోరుట్ల బస్టాండ్ ఏరియా, సుభాష్నగర్, సుబ్రహ్మణ్యంనగర్, శివసాయినగర్, సాయినగర్లో కూడా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు పెరిగి పెద్దవయ్యాయి. పట్టణంలోనూ నీడను ఇచ్చే చెట్లు, పూలమొక్కలు నాటి సంరక్షిస్తుండడంతో అవి పెరిగి ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి.
హరితనిధిని స్వాగతిస్తున్నాం
పచ్చదనాన్ని విస్తృతం చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయనున్న హరితనిధిని స్వాగతిస్తున్నాం. ఈ కార్యక్రమంతో తెలంగాణ పచ్చల హారంగా మారనున్నది. అంతేకాకుండా ప్రతిఒక్కరికీ పర్యావరణ పరిరక్షణపై స్పృహ పెరుగనున్నది. ముఖ్య మంత్రి పిలుపుమేరకు ఈ మహోద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులుగా భాగస్వాములవుతాం. తమవంతుగా నిధిని సమకూర్చేందుకు యత్నిస్తాం.
-ఉపాధ్యాయుల చంద్రశేఖర్, రాజన్న దేవాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు