యాసంగిలో గంటకు రూ.2,500.. ఇప్పుడు 3వేలు
డీజిల్ ధరలు పెరగడమే కారణం
ఉమ్మడి జిల్లా రైతాంగంపై రూ.57కోట్ల అదనపు భారం
కేంద్రం తీరుపై మండి పడుతున్న అన్నదాతలు
తిరుమలగిరి, నవంబర్ 1 : అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న డీజిల్ ధరలు పంట చేతికొచ్చే సమయంలోనూ అన్నదాతపై అదనపు భారం మోపుతున్నాయి. వాతావరణ పరిస్థితులు, కూలీల కొరతతో రైతాంగం వరి కోతలకు యంత్రాలపై ఆధారపడుతుండగా, భగ్గుమంటున్న డీజిల్ రేట్ల కారణంగా హార్వెస్టర్ యజమానులు రేట్లు పెంచేశారు. గత యాసంగిలో గంటకు రూ.2,500 ఉన్న కిరాయిని ఇప్పుడు 3వేలకు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వానకాలం 11,39,572ఎకరాల్లో వరి సాగవగా, కోతలకు రైతాంగంపై దాదాపు రూ.57 కోట్ల అదనపు భారం పడుతున్నది. మరోవైపు ధాన్యం తరలించేందుకు ట్రాక్టర్ కిరాయి కూడా పెరిగిందని రైతులు వాపోతున్నారు. డీజిల్ ధరలను నియంత్రించని కేంద్ర ప్రభుత్వ తీరుపై అన్నదాతలు భగ్గుమంటున్నారు.
అడ్డూ అదుపూ లేకుం డా పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆరుగాలం కష్టించే అన్నదాతలపై మోయలేని భారం పడుతుంది. ఒకవైపు వాతావరణ అననుకూలతలు, మరోవైపు కూలీల కొరతతో రైతన్నలు యంత్రాలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. రైతు బంధు, ఉచిత విద్యుత్, సాగునీరు, రైతు బీమా వంటి పథకాల చేయూతతో రాష్ట్ర సర్కారు అన్నదాతలకు అండగా నిలుస్తుంటే, నియంత్రణలేని డీజిల్ ధరల పెంపుతో కేంద్రం మాత్రం రైతుల నడ్డి విరుస్తున్నది. ప్రస్తుతం వానకాలం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 4 లక్షల 968 ఎకరాల్లో, సూర్యాపేటలో 4,69,604 ఎకరాల్లో, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 2.69లక్షల ఎకరాల్లో వరిసాగు చేపట్టగా ఇప్పటికి 40 శాతం కోతలు పూర్తవగా ఇంకా 70 శాతం మిగిలి ఉన్నాయి. అయితే పెరిగిన డీజిల్ ధరలతో వరికోత మిషన్ల యజమానులు కూడా ధరలు పెంచారు. గతేడాది గంటకు 26 వందల నుంచి 27 వందలు ఉండగా ప్రస్తుతం 3 వేల నుంచి 3 వేల ఒక వంద రుపాయల వరకు తీసుకుంటున్నారు. ట్రాక్టర్ల కిరాయి సైతం పెరిగింది. గతంలో స్థానికంగా (ఊరిలోనే లోకల్ కిరాయి ) రూ.500 ఉంటే ప్రస్తుతం రూ. వెయ్యి అయింది. ఇక ఇతర గ్రామాల నుంచి ధాన్యం తేవాలంటే రూ.3 నుంచి 4 వేలు కిరాయి చెల్లించాల్సిందే. ప్రస్తుతం వరికోత మిషన్లు, ట్రాక్టర్ల కిరాయిలు ఎకరానికి రూ.5 వేలు చెల్లించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరికోత మిషన్లకు పెరిగిన డిమాండ్
కూలీలతో వరికోతలు దాదాపు తగ్గాయి. ప్రతి గ్రామంలో వరికోత మిషన్లే దర్శనమిస్తున్నాయి. గతంలో మండలం మొత్తానికి నాలుగైదు మిషన్లు ఉంటే నేడు ప్రతి గ్రామంలో నాలుగైదు దర్శనమిస్తున్నాయి. గతంలో టైర్లు, చైన్ వాహన రకాన్ని బట్టి ఎకరానికి 2 వేల నుంచి 2 వేల 700 ఉంటే ఇప్పుడు గంటకు 3 వేలు తీసుకుంటున్నారు. ఎకరం పొలాన్నే గంటకు పైగా కోస్తున్నారు. పెరిగిన డీజిల్ ధరలతో వరికోత మిషన్ల యజమానులు సైతం ఆమాంతం ధరలు పెంచారు. గత ఐదేళ్ల నుంచి డీజిల్ ధరలు పరిశీలిస్తే 2017లో రూ.61.78 ఉంటే 2018లో రూ.80.21, అదే 2019లో రూ.72.71, కాగా 2020లో 76.82గా 2021లో 107.19గా డీజిల్ ధర పెరిగింది.
వరితో పోల్చితే వాణిజ్య పంటలే మేలు
ముప్పేట పెరిగిన ధరలతో రైతులు వరి సాగు బదులు వాణిజ్య పంటలే మేలని భావిస్తున్నారు. అందుకే ఈ యాసంగీలో ఆరుతడి పంటల వైపే మొగ్గుచూపుతున్నారు. వరి ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే రూ.40 వేల ఆదాయం వస్తుంది. అంటే ఆరుగాలం కష్టిస్తే ఎకరాకు మిగిలేది కేవలం రూ.10 వేలు. అదే పత్తి, పెసర, కంది వంటి ప్రత్యామ్నాయ పంటలకు క్వింటాకు రూ.7 నుంచి 8 వేలు వస్తుండటంతో రైతులు ఆ దిశగా ఆడుగులు వేసేందుకు ముందుకు వస్తున్నారు.