కలెక్టర్ పీజే పాటిల్
నల్లగొండ, నవంబర్ 5: పోడు భూముల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఆర్డీఓలు, తాసీల్దార్లు, ఎంపీడీఓలు, అటవీ అభివృద్ధి అధికారులతో పోడు భూముల సమస్యలపై సమీక్షించారు. ఆర్ఓ ఎఫ్ఆర్ చట్టం 2005 ప్రకారం అటవీ హక్కులకు అర్హులైన వారు సాంకేతిక కారణాలు, చిన్నచిన్న సమస్యలు, సమాచారం లేక దరఖాస్తులు చేసుసుకోలేక పోయారన్నారు. జిల్లాలో 13 మండలాల్లో పోడు భూముల సమస్య ఉందని, పోడు వ్యవసాయ చేసుకుంటున్న వారి నుంచి నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తులు తీసుకోవాలని తెలిపారు. ఆర్ఓ ఎఫ్ఆర్ కమిటీలను స్వీకరించాలని చెప్పారు. గ్రామాల్లో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామ సభలు ఏర్పాటు చేయాలన్నారు. 15 మంది సభ్యులను కమిటీలో నియమించుకోవాలని, మండల, డివిజన్ లెవల్లో కమిటీలు ఉండాలని, కమిటీలో మహిళలు కూడా ఉండేవిధంగా చూసుకోవాలని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ తర్వాత, అటవీ, రెవెన్యూ అధికారులు విచారణ చేయాలని చెప్పారు. సభ్యులకు సందేహాలు ఉంటే అటవీ హక్కుల కమిటీ ద్వారా నివృత్తి చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అటవీ శాఖ అధికారి రాంబాబు, ఆర్డీఓలు రోహిత్సింగ్, గోపీరాం, అటవీ, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు పాల్గొన్నారు.