నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): కొవిడ్ రెండు విడుతలుగా విదిల్చిన విషాదాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడో విడుత విస్తరించినా తట్టుకుని నిలబడాలంటే అందరికీ వ్యాక్సిన్ పూర్తి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటి ప్రధాన సంస్థలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి కార్యాచరణ ప్రకటించింది. అందులో భాగంగా ఈ ఏడాది జనవరి నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలో వ్యాక్సినేషన్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. నిర్దేశించుకున్న లక్ష్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 81 శాతం పూర్తయింది. ప్రారంభంలో హెల్త్ వర్కర్స్, ఫ్రంట్లైన్ వారియర్స్, తరువాత 45 నుంచి 59 ఏండ్లు వారికి, అనంతరం 60 ఏండ్ల పైబడిన వారికి ఇలా ఒకరి వెంట ఒకరికి ప్రాధాన్యతల ప్రకారం వ్యాక్సిన్ ఇస్తూ వచ్చారు. రెండో విడుత కరోనా ఉధృతితో ప్రజలంతా టీకా కోసం ఎగబడ్డారు. వ్యాక్సిన్ డోసులు కూడా విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం విరివిగా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో సెప్టెంబర్ నుంచి దీనిపై కార్యాచరణ ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో సెప్టెంబర్ 16 నుంచి మాస్ వ్యాక్సినేషన్ పేరుతో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ తొలి డోస్ ఇవ్వాలని క్షేత్రస్థాయి వరకు ఆదేశాలు జారీ చేసింది. వందశాతం పూర్తి కావాలని స్పష్టం చేసింది. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ప్రత్యేకంగా గ్రామాలు, పట్టణాలకు వేర్వేరుగా విస్తృతంగా బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని గ్రా మాలు, పట్టణాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిగా విభజిస్తూ వ్యాక్సినేషన్ కార్యచరణను అమలు చేస్తున్నారు. గ్రామాల్లో అంగన్వాడీ టీచర్, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం, పంచాయతీ సిబ్బందిని కలిపి నలుగురితో బృందంగా ఏర్పాటు చేశారు. పట్టణాల్లోనూ అంగన్వాడీ టీచర్, ఆశావర్కర్, ఏఎన్ఎంలు, మెప్మా సిబ్బందితో కలిపి నలుగురితో బృందాన్ని నియమించారు. పట్టణాల్లో ఏఎన్ఎంలు అందుబాటులో లేకుంటే నర్సింగ్ కాలేజీ విద్యార్థ్ధులను వినియోగిస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో 9.56 లక్షల మందికి
మాస్ వ్యాక్సినేషన్లో భాగంగా నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 9,56,947 మందికి తొలి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. వీరిలోనే గడువు ప్రకారం 2,78,366 మందికి రెండో డోస్ కూడా ఇచ్చారు. అయితే జిల్లాలో 18 యేండ్ల నిండి వ్యాక్సిన్కు అర్హులైన వారు మొత్తం 12,07,165 మంది ఉన్నట్లుగా వైద్యారోగ్యశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 79 శాతం టార్గెట్ పూర్తి కాగా మిగిలిన వారికి కూడా త్వరలోనే వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళికబద్ధ్దంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో మొత్తం 439 వైద్య బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీల పరిధిలో 257 బృందాలు, పట్టణాల్లోని వార్డుల పరిధిలో 182 బృందాలు ఉన్నాయి. వీరిని నిరంతరం ఆయా పీహెచ్సీలు, యూపీహెచ్సీల వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 708 గ్రామీణ ఆవాసాలతో పాటు 455 పట్టణ ప్రాంత కాలనీల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. తొలి డోస్ వంద శాతం పూర్తి కాగానే రెండో డోస్ కూడా నిర్దేశిత గడువు ప్రకారం నిరాటంకంగా కొనసాగుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.
సూర్యాపేటలో 6.21లక్షల మందికి
సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 76 శాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు వైద్యారోగ్య శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ మొత్తం అర్హులైన వారు 8,16,752 మంది ఉన్నట్లు గుర్తించగా ఇప్పటివరకు 6,21,198 మందికి తొలి డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకు తొలి, మలి డోసులు పూర్తయినవారు 2,23,594 మంది ఉన్నారు. మిగిలిన వారిని క్షేత్రస్థాయిలో గుర్తిస్తూ నూరు శాతం పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 153 బృం దాలు, పట్టణ ప్రాంతాల్లో 141 ప్రత్యేక బృందా లు మాస్ వ్యాక్సినేషన్లో పలు పంచుకుంటున్నాయి. ఈ జిల్లాలో మొత్తం ఆవాసాల్లో ఇప్పటివరకు 327 గ్రామీణ ఆవాసాలతో పాటు 91 పట్టణ ప్రాంత వార్డుల్లో 100శాతం వ్యాక్సిన్ పూర్తైనట్లు అధికారులు వెల్లడించారు. మిగతా వాటిల్లోనూ వంద శాతం పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
యాదాద్రి జిల్లాలో 91శాతం
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతో పోలిస్తే యాదాద్రి జిల్లాలో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతున్నది. నూరు శాతం టార్గెట్ను చేరుకునే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. యాదాద్రి జిల్లాలో రెండో విడుత కరోనా ఉధృతి సమయంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ఈ జిల్లాను ఫైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఇతర జిల్లాల కంటే ముందు నుంచే ఇక్కడా మాస్ వ్యాక్సినేషన్ను స్పెషల్ డ్రైవ్గా చేపట్టారు. దీంతో ఇక్కడ ఇప్పటివరకు 91శాతం లక్ష్యాన్ని చేరుకోగలిగారు. జిల్లాలో మొత్తం అర్హులైన వారు 5,23,600 మంది ఉన్నట్లుగా అంచనా వేయగా ఇందులో ఇప్పటివరకు 4,80,844 మందికి తొలి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది. మరో 43 వేల మందికి వ్యాక్సిన్ ఇస్తే నూరుశాతం పూర్తి కానుంది. ఇక రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య కూడా ఇక్కడ గణనీయంగా ఉంది. మొత్తం టార్గెట్లో 46 శాతంతో 2,43,150 మందికి రెండు డోసుల వ్యాక్సిన్ కూడా పూర్తి చేశారు. ఇక ఇప్పటివరకు జిల్లాలో 187 గ్రామీణ ప్రాంతాలతో పాటు 22 పట్టణ ప్రాంత వార్డుల్లో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.