రాంనగర్, మే 5: కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్నందున అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి సూచించారు. బుధవారం రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర విభాగాలకు చెందిన పోలీస్ అధికారులతో కరోనా నియంత్రణ, పోలీసులు తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కొనసాగుతున్న వైరస్ ఉధృతి పరిస్థితుల్లో లక్షణాలున్నట్లు అనుమానం ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. నిర్ధారణ అయితే మెడికల్ కిట్లను తీసుకుని మందులను వాడాలని సూచించారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. వైరస్ బారిన పడిన పోలీసులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర, కమిషనరేట్, జిల్లా స్థాయిలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించామన్నారు.
వైరస్ ప్రభావంతో పరిస్థితి విషమంగా మారిన సందర్భాల్లో వారికి ఎ లాంటి అవసరాలున్నాయనే విషయాలను స్పష్టం గా తెలుసుకుని రాష్ట్ర స్థాయి విభాగానికి నోడల్ అధికారులు సమాచారం అందించినట్లయితే మెరుగైన వైద్య చికిత్స కోసం ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు. అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించాలని సూచించారు. గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్రెడ్డి మాట్లాడుతూ.. అన్ని స్థాయిలకు చెందిన పోలీసులకు జాగ్రత్తలు పాటించే విషయంలో అవగాహన కల్పించామని పేర్కొన్నారు. కమిషనరేట్ స్థాయిలో అడిషనల్ డీసీపీ (పరిపాలన)ని నోడల్ అధికారిగా నియమించామని, డివిజన్ స్థాయిల్లో ఎస్ఐలు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కమిషనరేట్లో పోలీసులకు వ్యాక్సినేషన్ 95శా తం పూర్తయిందని వివరించారు. వీడియో కాన్ఫరె న్స్లో అడిషనల్ డీసీపీ (పరిపాలన) జి.చంద్రమోహన్, ఏఎస్పీ రితిరాజ్, ఎస్బీఐ వి.శ్రీనివాస్, కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.