ధాన్యం సేకరణపై సర్కారు దృష్టి
ముందస్తు ప్రణాళికలు సిద్ధం
రంగంలోకి మార్కెటింగ్ శాఖ అధికారులు
ఊరూరా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు
కరీంనగర్ మినహా ఉమ్మడి జిల్లాలో 6,59,165 ఎకరాల్లో సాగు..
16 ,36,720 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
ఆన్లైన్ ద్వారా అక్రమాలకు చెక్
పెద్దపల్లి, అక్టోబర్3 (నమస్తే తెలంగాణ):రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న సర్కారు వానాకాలం సాగు చేసిన ధాన్యం కొనుగోళ్లపై దృష్టిపెట్టింది. అన్నదాత ముంగిట్లోనే కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సారి కరీంనగర్ మినహా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6,59,165 ఎకరాల్లో సాగు చేయగా 16,36,720 లక్షల మెట్రిక్ ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసింది. సహకార, ఐకేపీ, డీసీఎంఎస్, మెప్మా, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 946 సెంటర్లు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణకు రంగం సిద్ధం చేసింది. ధాన్యం క్వింటాలుకు రూ.1960 మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది.
రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతున్నది. వానకాలం వేసిన వరి కోతకొస్తున్న వేళ కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. అన్నదాతల ముంగిట్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలన్న ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగింది. కరీంనగర్ మినహా ఉమ్మడి జిల్లాలో 659165 ఎకరాల్లో సాగు చేయగా, 16 36720 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసింది. కాళేశ్వర జలాలు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణకు తోడు భారీ వర్షాలు కురవడంతో బీడు భూములన్నీ వరి సిరితో కళకళలాడుతున్నాయి. సాగు విస్తీర్ణం దాదాపు రెట్టింపుఅయింది. అంచనాలకు మించి ధాన్యం దిగుబడి రానున్నది. యాసంగిలోనూ ఎర్రటి ఎండల్లో మత్తళ్లు దూకిన చెరువులతో సాగు పెరిగి గతంలో కన్నా రెండింతల ధాన్యం దిగుబడి వచ్చింది. ఊహించని విధంగా సాగుపెరగడం దిగుబడి రావడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లి విరిసింది. రైతు బిడ్డ ముఖ్య మంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఎవసమంటే విరక్తి చెందిన నాటి రోజులు పోయి పండుగ అనే పరిస్థితి వచ్చింది. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, రుణమాఫీ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలతో రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం, చేతికొచ్చిన పంటను సైతం కొనుగోలు చేస్తున్నది. కాలానికి తగ్గట్టుగా మద్దతు ధర పెంచుతూ ప్రోత్సాహాన్ని ఇస్తున్నది. ప్రస్తుతం మద్దతు ధర క్వింటాలుకు రూ. 1960 ప్రకటించడంతో రైతుల్లో హర్షం వ్యక్త మవుతున్నది.
యేటేటా పెరుగుతున్న మద్దతు..
యేటేటా ధాన్యానికి మద్దతు ధర కూడా ప్రతి సంవత్సరం పెంచుతూ వస్తున్నది. యాసంగిలో ఏగ్రేడు రకం క్వింటాలుకు ధర రూ. 1,888లు, బీగ్రేడ్ రకానికి రూ.1868 చెల్లించింది. ఈవానాకాలంలో మద్దతు ధర 1960, సాధారణ రకానికి 1640 గా ప్రకటించిచడంపై రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ధాన్యం విక్రయించిన రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్రైస్) కోసం మిల్లర్లకు అప్పగించే విషయంలో అక్రమాలకు తావులేకుండా ఈచర్యలు తీసుకుంటున్నది. మిల్లర్ల సామర్థ్యాన్ని బట్టి ధాన్యం కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నది. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వాహనాలను సైతం ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంట నింపేందుకు 87లక్షల 50వేల గన్నీ సంచులు అవసరమని అంచనా వేసింది. ధాన్యం శుద్ధి యంత్రాలు, తూకం మిషన్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచింది. కోసిన ధాన్యం వెంట వెంటనే కేంద్రాలకు తరలించేలా రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలో..
జిల్లాలో ఈ వానకాలంలో 2, 02, 715 ఎకరాల్లో వరి సాగు చేపట్టగా, 4, 96, 224 క్వింటా ళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసింది. అందు లో 4, 46, 601మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 292 కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. గత 2019 వానకాలంలో 1, 99, 562 ఎకరాల్లో వరి సాగు చేయగా, 5,13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, 2020 వానకాలంలో 2, 02, 077 ఎకరాల్లో సాగు చేయగా, 5.14 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది.