సీజన్ ప్రారంభంలోనే అధిక ధర పలుకుతున్న పత్తి
క్వింటాల్కు రూ.7450తో కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
కాశీబుగ్గ, అక్టోబర్ 3 : ఎనుమాముల మార్కెట్లో పత్తి కొనుగోళ్లు జోరందుకున్నాయి. సీజన్ ప్రారంభంలోనే పత్తి ధర మద్దతు ధరను మించి పలుకుతున్నది. ప్రస్తుతం క్వింటాల్కు రూ.6025 ఉండగా ప్రైవేట్ వ్యాపారులు రూ.7450 ధర వెచ్చించి మరీ కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు సంబురపడుతున్నారు. గత సీజన్లో అత్యధికంగా క్వింటాల్కు రూ.8230 ధర పలికింది.
ఎనుమాముల మార్కెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను మించి పత్తికి ధర పలుకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పత్తికి మద్దతు ధర క్వింటాల్కు రూ.6025 ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు రూ.7450 ధరతో కొనుగోలు చేస్తున్నారు. గత సంవత్సరం అక్టోబర్లో మద్దతు ధర క్వింటాల్కు రూ.5825 ఉన్నది. సీజన్ ప్రారంభంలో క్వింటాల్కు రూ.3500 నుంచి రూ.4815 వరకు ధరలతో ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేపట్టారు. అయితే పత్తికి మద్దతు ధర పెరుగకపోవడంతో ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ప్రారంభించింది. నవంబర్ 2 నుంచి సీసీఐ కొనుగోలు ప్రారంభించింది. దీంతో రైతులకు మద్దతు ధరలు లభించాయి. సీజన్ చివరిలో ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేయడంతో అత్యధికంగా క్వింటాల్కు రూ.8230 ధర పలికింది.
ఈ సీజన్లో ధరలు పైపైకి..
ప్రస్తుతం అక్టోబర్ నుంచి పత్తి సీజన్ ప్రారంభం కాగా, ధరలు మాత్రం మద్దత ధరను మించిపోతున్నాయి. గతం కంటే పత్తికి మంచి ధరలు పలుకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రారంభంలోనే ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి కొనుగోళ్లు చేపడుతున్నారు. దీంతో పత్తి క్వింటాల్కు రూ.7450 ధర పలికింది.
మార్కెట్కు తగ్గిన పత్తి ..
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు నిరుటి అక్టోబర్తో పోల్చితే ఈసారి పత్తి రాక తగ్గింది. 2019-20(అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు)లో మార్కెట్కు 22లక్షల 27వేల 270 క్వింటాళ్లు రాగా, 2020-21(అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు)లో 16లక్షల 54వేల 326 క్వింటాళ్ల పత్తి వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి బరుపాటి వెంకటేశ్ రాహుల్ తెలిపారు.