నందికొండ, ఆగస్టు 2 : శ్రీశైలం నుంచి వస్తున్న కృష్ణమ్మ పరుగులతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో డ్యామ్ 22 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం 14 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 1,06,462 క్యూసెక్కల నీటిని విడుదల చేయగా, ఎగువ నుంచి వస్తున్న వరదను అంచనా వేస్తూ క్రస్ట్ గేట్లను పెంచుకుంటూ సోమవారం ఉదయం 22 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,18,076 క్యూసెక్కుల నీటిని వదిలారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను 587.20 అడుగుల (305.6242 టీఎంసీల) వద్ద నీరు నిల్వ ఉంచి అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ఎస్ఎల్బీసీకి 1800 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 33,211 క్యూసెక్కులు, వరద కాల్వకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్కు 3,54,288 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, అదే స్థాయిలో అవుట్ఫ్లో కొనసాగిస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 883.70 అడుగులు (208.2841 టీఎంసీలు) ఉంది. శ్రీశైలానికి ఎగువ నుంచి 3,49,515 క్యూసెక్కులు వస్తుండగా, 10 క్రస్ట్ గేట్లను 15 అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్కు 3,54,288 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు సాగర్కు పర్యాటకుల తాకిడి పెరిగింది.
639.60 అడుగులకు చేరిన మూసీ
కేతేపల్లి : నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 639.60 (3.12 టీఎంసీలు) అడుగులకు పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి 1026.20 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. కుడి, ఎడమ కాల్వలకు 629.28 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు) అడుగులు.