కూల్చివేతలు షురూ
నాలా ఆక్రమణపై కదిలిన బల్దియా యంత్రాంగం
వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు
20కి పైగా అక్రమ నిర్మాణాల కూల్చివేత
హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజానీకం
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): అక్రమ నిర్మాణాలపై సిరిసిల్ల బల్దియా కొరడా ఝులిపించింది. భవిష్యత్లో వరద నీరు ఇండ్లలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్న అమాత్యుడి ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. వరద నీరు సాఫీగా వెళ్లకపోవడానికి నాలాల ఆక్రమణలే కారణమని గుర్తించి వాటిపై దృష్టి సారించింది. బీవైనగర్ నుంచి మొదలుకొని అంబేద్కర్ నగర్ వరకు నాలాలపై 1500 ఇండ్లు నిర్మించినట్టు గుర్తించి కూల్చివేతకు ఉపక్రమించింది. శుక్రవారం 20 నిర్మాణాల దాకా కూల్చివేయగా ఇకపై వరద ఇబ్బందులు ఉండవని పట్ణణ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
చిన్న పాటి వర్షానికే రోడ్లు జలమయం కావడం, భారీ వర్షాలు పడితే సిరిసిల్ల పట్టణం మునిగి పోవడం మామూలై పోయింది. దీనికంతా కారణం వరద నీరొచ్చే కాలువలు కబ్జాలకు గురికావడమేనని అధికారులు గుర్తించారు. పట్టణంలోని రెండు ప్రధాన కాలువలపై బీవైనగర్ నుంచి మొదలుకొని కొత్త చెరువు వరకు, నెహ్రూనగర్ నుంచి అంబేద్కర్ నగర్ వరకు 1500లకు పైగా అక్రమ నిర్మాణాలు జరిగినట్లు బల్దియా సర్వేలో వెల్లడైంది. వరద నీరు సాఫీగా వెళ్లాలంటే నాలాలు, కాలువలపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించడమే ప్రధాన సమస్యకు పరిష్కారమని ఇంజినీరింగ్ అధికారులు సూచించారు. వారి సూచనల మేరకు బల్దియా అధికారులు రెండు ప్రధాన కాలువల పక్కన నిర్మించిన అక్రమ కట్టడాలకు రెడ్ మార్కులు వేశారు.
భవిష్యత్ ప్రణాళిక సిద్ధం …
భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగి పోవడం, ఆ ప్రాంత ప్రజల ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల ఇబ్బందులు వర్ణణాతీతం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అధికార యంత్రాంగానికి సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. అమాత్యుడి ఆదేశాలతో సిరిసిల్ల పట్టణ శివారు బోనాల గ్రామం నుంచి కొత్త చెరువు వరకు ఉన్నటు వంటి కాలువ కబ్జాకు గురైంది. వెంటనే ఆ కాలువ పునర్నిర్మాణం చేపట్టారు. కాలువ నిర్మాణంతో పాటే నాలాపై నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతలపై బల్దియా ఉక్కుపాదం మోపింది. 1500ల పైగా ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతలను శుక్రవారం ప్రారంభించింది. ఇరవైకి పైగా ఆక్రమ నిర్మాణాలను తొలగించింది. వర్షం కురువడంతో మరుసటి రోజు కు కూల్చివేతలను వాయిదా వేసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు కమిషనర్ సమయ్య ఆధ్వర్యంలో టీపీవో అన్సార్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు నవీన్, అనిల్ బృందం పోలీసుల బందోబస్తు మధ్య 20 మంది సిబ్బంది కూల్చివేతలను ప్రారంభించారు. నాలాపై ఇరుపక్కల ఎక్కువ శాతం బాత్రూంలు, ప్రహరీలు నిర్మించారు. ఒక్కో ఇంటికి 3 నుంచి 7 ఫీట్ల వరకు నిర్మించిన ఆక్రమణలను తొలగించి వేశారు. వరద నీటి ఇబ్బందులు తీర్చేందుకు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నందుకు సిరిసిల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.