అందరికీ అందుబాటులో ఉన్నత విద్య
ఐసీటీ విధానంలో బోధన, పాఠ్యాంశాలు
బీఆర్ఏఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సీతారామారావు
రామగిరి, ఆగస్టు 1 : ఉన్నత విద్యనభ్యసించాలనుకునే వారికి రెగ్యులర్ యూనివర్సిటీలకు దీటుగా నాణ్యమైన, గుణాత్మక విద్య అందించడమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లక్ష్యమని యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ కె. సీతారామారావు వెల్లడించారు. ఆదివారం నల్లగొండలోని యూనివర్సిటీ రీజినల్ సెంటర్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుణంగా విద్యారంగంలో సరళీకృత మార్పులతో ఐసీటీ ద్వారా ఆన్లైన్, టీవీ, రేడియో ద్వారా దేశవ్యాప్తంగా విద్యార్థులకు అందుబాటులో తెచ్చినట్లు చెప్పారు. సామాజిక, ఆర్థిక కారణాల వల్ల రెగ్యులర్ విద్యకు దూరమైన వారికి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ అర్హతతో డిగ్రీ , డిప్లోమా కోర్సులు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఏఓయూ అడ్మిషన్లలో ప్రథమ స్థానంలో ఉండటం అభినందనీయమన్నారు. డిప్యూటీ డైరెక్టర్ బి. ధర్మానాయక్ కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. ఈ క్రమంలో 2021-22 విద్యా సంవత్సరంలో యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ నెల 12 వరకు అవకాశం ఉందని తెలిపారు.
సీబీసీఎస్ విధానంలో
రెగ్యులర్ యూనివర్సిటీలకు దీటుగా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్(సీబీసీఎస్) విధానం అందుబాటులోకి తెచ్చి సెమిస్టర్ పద్ధతిలో యూజీలో విద్యనందిస్తున్నట్లు చెప్పారు. ఈ విధానంలో మూడు రకాలైన కోర్సులతో రెగ్యులర్ కంటే 40 శాతం అదనపు కోర్సులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. దూరవిద్యలో ఐసీటీని అందుబాటులోకి తెచ్చి విద్యార్థులకు టీవీ, ఆన్లైన్, రేడియో పాఠాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ‘బీఆర్ఏఓయూ మొబైల్యాప్’ అందుబాటులోకి తెచ్చినట్లు, ఈ యాప్ ద్వారా విద్యార్థి కోర్సులకు సంబంధించిన పాఠాలను వినే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బీఆర్ఏఓయూ అందించే ఉన్నత విద్యావకాశాలను www.braou.ac.in ద్వారా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వీసీకి ఘన స్వాగతం
నల్లగొండలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్ను ఆదివారం యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ఫ్రొఫెసర్ కె.సీతారామారావు సందర్శించారు. ఆయనకు ఉమ్మడి జిల్లా వర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డా॥ బి.ధర్మానాయక్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం యూనివర్సిటీ భవనంలోని ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో వీసీ మాట్లాడారు. డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు బి. రామకృష్ణ, మేడిపల్లి రవి, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ కె.చంద్రశేఖర్, అధ్యాపకులు ఆయనను సన్మానించారు. అనంతరం యూనివర్సిటీ ఆర్సీసీ ఆవరణలో వీసీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కౌన్సిలర్స్ చందా జగదీశ్వర్, నందకుమార్, మధుకర్రెడ్డి, నర్సింగ్ శంకర్, జ్వాల, పద్మావతి, సునీత, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం నల్లగొండలో సైన్స్ కోర్సులు అందుబాటులోకి తేవాలని ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, అధ్యాపకులు వినతి పత్రం అందచేశారు.
నర్సింహారావు విగ్రహం ఆవిష్కరణ
సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్ అధినేత నేవర్సు నర్సింహారావు సంస్మరణ సభ ఆదివారం పాఠశాల ఆవరణలో నిర్వహించారు. బీఆర్ఏ ఓయూ వీసీ సీతారామారావు, ట్రస్మా అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు చకిలం అనిల్కుమార్ పాల్గొని నర్సింహారావు విగ్రహాన్ని, ఆయన జీవితచరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు.