బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ హైమద్కు నలుగురు కుమారులు. వారిలో పుట్టుకతోనే దివ్యాంగుడు షేక్ నబీ. ఒక కాలు, ఒక చేయి సరిగా పనిచేయవు. అన్నదమ్ముల్లో ఇద్దరు పొలం పని, మరో సోదరుడు ఆటో రిక్షా నడుపుతుండగా నబీ మాత్రం వేసవిలో సోడా బండిని నడుపుతూ.. మిగిలిన ఎనిమిది నెలలు సీఎం కేసీఆర్ అందిస్తున్న రూ.3వేల పింఛన్తోనే జీవనాన్ని సాగిస్తున్నాడు. నాలుగేండ్ల క్రితం నబీకి పెండ్లి కాగా, ఒక కొడుకు. ఎండాకాలంలో రోజంతా కష్టపడి 160 సోడాలు అమ్మితే రూ.200 మిగులుతాయని, ఇలా నెలకు రూ.6వేల చొప్పున మూడు, నాలుగు నెలలు సంపాదిస్తానని చెబుతున్నాడు. మిగతా రోజుల్లో ప్రభుత్వం అందించే పింఛన్ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటానంటున్నాడు నబీ. కుటుంబంలో అందరితో సమానంగా ఉండాలనే ఉద్దేశంతో సోడా బండిని నడిపిస్తానని, కష్టపడే తత్వం ఉంటే భార్యాపిల్లలను ఎలాగైనా పోషించుకోవచ్చంటూ స్ఫూర్తినిస్తున్నాడు.
-బీర్కూర్, మే 3
చుట్టూ ఉన్న చీకటిని నిందించేకన్నా.. చీకటిని పారద్రోలే ప్రయత్నం చేసేవారే విజయాన్ని అందుకుంటారు. సాధన ద్వారా సాధించలేనిది ఏదీ లేదు. అవిటితనం శరీరంలోని అవయవాలకు మాత్రమే కానీ.. మనసుకు కాదని నిరూపిస్తూ దివ్యాంగుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. పుట్టుకతోనే అంగవైకల్యం వచ్చినా బాధపడకుండా ఉపాధి బాటలో ముందుకెళ్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు..
మంచి సంకల్పం అనేది మంచి కార్యఫలితాలకు ఆదిగురువు. తన మీద తనకు ఆత్మ విశ్వాసాన్ని, గౌరవాన్ని పెంచుకునేలా చేస్తుంది. సంతృప్తితో నిండిన జీవిత గమ్యం సొంతమవుతుంది. నిజామాబాద్ నగరంలోని దక్షిణ మండల తహసీల్ కార్యాలయంలో పనిచేసే విజయలక్ష్మి సంకల్పానికి మారుపేరుగా నిలుస్తున్నది. అంధురాలైన విజయలక్ష్మి స్టిక్ సహాయంతో రహదారిపై నడుచుకుంటూ వెళ్తుంది. వాహనాల సౌండ్ను గుర్తిస్తూ కార్యాలయానికి చేరుకుంటున్నది. తనకు కండ్లు కనిపించకపోయినా తనకున్న సంకల్పమే తనను నడిపిస్తుందని చెబుతున్నదీ విజయలక్ష్మి.
-ఇందూరు, మే 3
ఈ ఫొటోలో కనిపిస్తున్న దంపతులిద్దరూ దివ్యాంగులు. చందూర్ మండల కేంద్రంలో కొన్నేండ్ల నుంచి జీవిస్తున్నారు. వీరికి ఒక పాప. బతుకుదెరువు కోసం పనిచేద్దామంటే అవిటితనం అడ్డంకిగా మారడంతో యాచిస్తూ జీవనం గడుపుతున్నారు. తన భర్త బండి (ట్రైసైకిల్)ని లాగుతూ చుట్టు పక్కల ఊర్లన్నీ తిరుగుతూ యాచిస్తారు. దొరికింది తింటూ.. దొరకని రోజు పస్తులుంటూ.. వారి బాధ ఎవరికీ మొరపెట్టనట్టుగా జీవిస్తున్నారీ ఈ దంపతులు. ఎన్ని కష్టాలున్నా.. ఎప్పుడూ అన్యోన్యంగా కనిపిస్తూ చూసేవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
-చందూర్, మే 3