కడెం వరదగేట్ల నీటితో బంగారు పంటలు
ఆదర్శంగా నిలుస్తున్న పాండ్వాపూర్ రైతులు
ప్రతియేటా రెండు పంటలు పండిస్తూ..
కరువును జయించిన అన్నదాతలు
కడెం, ఏప్రిల్ 21: వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి దాని ద్వారా పంటలను సాగు చేస్తూ, ప్రతి ఏడాది వానాకాలం, యాసంగి పంటలను పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కడెం మండలంలోని పాండ్వాపూర్, అంబారిపేట, దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామాల సమీపంలో రైతులు ప్రతి ఏటా రెండు పంటలు పండిస్తూ కరువును ఎదుర్కొంటున్నారు. ఇక్కడి గ్రామాల వారికి కరువన్న మాటే రాదు. ఎందుకంటే ఈ గ్రామాలకు సమీపంలో సాగునీరు పుష్కలంగా ఉంటుంది. దానిని ఒడిసిపట్టి, మోటర్ల ద్వారా వారి పంటలకు వినియోగించుకుం టున్నారు ఇక్కడి రైతులు.మోటర్ల ద్వారా మళ్లిస్తూ..
కడెం జలాశయం వరద గేట్ల ద్వారా లీకేజీ నీరు ఈ గ్రామాలకు సమీపం నుంచే వెళ్తుంది. ఊటబావిలాగా ఎల్లప్పుడూ కొనసాగే ఈ నీటిని ఇక్కడి రైతులు మోటర్ల ద్వారా వారి పంటపొలాలకు మళ్లిస్తున్నారు. ప్రతి ఏటా రెండు పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం యాసంగిలో దాదాపు 300కు పైగా ఎకరాల్లో ఇక్కడ వరి పంటను సాగు చేస్తున్నారు. వరితో పాటు మక్కజొన్న, నువ్వు పంటలను కూడా వేస్తారు. ఈ పంటపొలాలకు మోటర్లే ప్రధానం కావడంతో రైతులకు ప్రభుత్వం అందిస్తున్న నిరంతర విద్యుత్ ద్వారా నిత్యం పంటపొలాలకు నీటిని అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎప్పుడూ నీళ్లు పుష్కలంగా ఉంటాయి. కడెం నదికి ఇరువైపులా చూస్తే, వేసవిలో అంతటా నీటి సమస్య ఉన్నా ఇక్కడ మాత్రం పంటపొలాలు కళకళాడుతాయి. ఇక్కడ రైతులు యాసంగిలో అందరూ ఒకే రకమైన విత్తనాలు వేస్తారు. ప్రధానంగా 1010తో పాటు బతుకమ్మ విత్తనాలను సాగు చేస్తారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉంది. గ్రామ సమీపాన పచ్చని పంటపొలాలతో పంటలు ఆహ్లాదంగా కనిపిస్తాయి. నిర్మల్-మంచిర్యాల రహదారికి ఇరువైపులా ఉన్న ఈ పంటపొలాలను చూస్తే ఈ వేసవిలో ఎక్కడా ఇలాంటి వాతావరణం కనిపించదు. ఈ ప్రాంతమంతా ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఇక్కడి రైతులకు ఇది జీవనాధారమనే చెప్పాలి. వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి పంటలు సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
సాగు నీటికి ఢోకా లేదు..
మాకు వ్యవసాయమే జీవనాధారం. వానాకాలం, యాసంగి తేడా లేకుండా పంటలు సాగు చేస్తాం. రాష్ట్ర సర్కారు కరెంట్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవడంతో మా పంటలకు ఎలాంటి ఢోకా లేదు. నిరంతరం సాగుతో పంటలు చేతికొచ్చే దశలో ఉన్నాయి. మా పొలాలకు సాగునీటికి ఢోకా లేదు. కడెం కాలువల ద్వారా మాకు నీళ్లు పెద్దగా అవసరం ఉండదు. వరదగేట్ల ద్వారా లీకేజీ అవుతున్న నీళ్లు వృథాగా పోతాయి. వాటినే మేము వాడుకుంటాం. మా పంటలకు నీటి సమస్య ఉండదు.