తాజాగా కేంద్రం ఆమోద ముద్ర
రెండు జోన్ల పరిధిలోకి ఉమ్మడి జిల్లా
భారీగా తగ్గిన జోన్ల వైశాల్యం
స్థానికేతరుల కోటాకు కత్తెర
పెరగనున్న ఉద్యోగావకాశాలు
స్థానికులకే 95 శాతం చాన్స్
పదోన్నతులకు మార్గం సుగమం
స్వాగతిస్తున్న ఉద్యోగులు
హర్షం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు
కుమ్రం భీం ఆసిఫాబాద్/మంచిర్యాల, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ):దశాబ్దాల పాటు తెలంగాణ ప్రాంతవాసులకు నష్టం చేకూర్చిన పాత జోనల్ విధానం ఇక రద్దు కాను న్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న కొత్త జోనల్ వ్యవస్థ కొంగొత్త ఆశలు రేపుతున్నది. తాజాగా కేంద్రం ఆమోదముద్ర వేయగా, ఇక అమల్లోకి రాబోతున్నది. కొత్త ఉద్యోగ నియామకాలే కాదు, ఉద్యోగోన్న తులు, బదిలీల వంటి వాటికి మార్గం సుగమం కానున్నది. ఇక నుంచి దాదాపు అన్ని ఉద్యోగ నియామకాలు నయా పద్ధతిలోనే భర్తీ కానుండగా, దీని ద్వారా అన్ని ప్రాంతాల నిరుద్యోగులకు సముచిత న్యాయం జరుగనున్నది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా రెండు జోన్ల పరిధిలోకి వెళ్లగా.. ఆయా జోన్ల పరిధిలో ఉన్న పరిస్థితులను లోతుగా చూస్తే, ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు మన వాళ్లకే వచ్చే అవకాశ మున్నది. అలాగే గతంతో పోలిస్తే.. జోన్ల వైశాల్యం తగ్గడం ఉద్యోగులకు కలిసొచ్చే అంశం కాగా.. జోనల్ వ్యవస్థ లేక ఇన్నాళ్లూ సాంకేతికంగా ఏర్పడి న సమస్యతో నిలిచిన ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల వంటి వాటికి శాస్త్రీయ పద్ధతిలో మోక్షం కలుగనున్నది. ఈ శుభ పరిణామాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తుండగా, నిరుద్యోగులు, విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
రెండు జోన్లలోకి ఉమ్మడి జిల్లా..
కొత్త జోనల్ విధానం వల్ల.. పూర్వ ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం రెండు జోన్ల పరిధిలోకి వెళ్లింది. నిజానికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఐదో జోన్ పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ జోన్ పరిధిలో (5వ జోన్) ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలు ఉండేవి. ప్రస్తుతం అమల్లోకి వచ్చే నూతన జోనల్ విధానంతో గత జోనల్ వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారుతాయి. రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పా టు కాబోతున్నాయి. ఇందులో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బాసర వేదికగా బాసర పేరిట రెండో జోన్ ఏర్పాటు చేశారు. ఈ జోన్ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలున్నాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే.. బాసర జోన్ పరిధిలోకి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు వస్తున్నాయి. అలాగే మొదటి జోన్గా కాళేశ్వరం పేరిట ఏర్పాటు చేయగా.. ఇందులో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాలున్నాయి. మన జిల్లాకు సంబంధించి.. కాళేశ్వరం జోన్ పరిధిలోకి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు వస్తున్నాయి.
కొత్త జోన్లతో కొత్త ప్రయోజనాలు..
కొత్త జోనల్ వ్యవస్థతో అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు, అలాగే ఉద్యోగులకు భారీగా లబ్ధి చేకూర్చుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలు కాళేశ్వరం జోన్-1 పరిధిలోకి వెళ్లాయి. ఈ జోన్ పరిధిలో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములు గు, కుమ్రం భీం ఆసిఫాబాద్లు ఉన్నాయి. అంటే మంచిర్యాల జిల్లాతో పోల్చితే పెద్దపల్లి మినహా మిగిలిన జిల్లాలు అన్ని రంగాల్లో ముఖ్యంగా విద్యారంగంలో వెనుకబడి ఉన్నాయి. అంటే ఈ జోన్ పరిధిలో ఉండే పోస్టులకు పోటీ పడే సమయంలో మంచిర్యాల నిరుద్యోగులు ఎక్కువగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. గతంలో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లావాసులు జిల్లా, జోనల్ పోస్టుల పరంగా చూసిన బదిలీల విషయంలో చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది.
కానీ.. ప్రస్తుతం జోన్ పరిధి తగ్గింది. దీని వల్ల దూరం తగ్గనుంది. అలాగే పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు రైల్వే సౌకర్యం ఉంది. ఉద్యోగులు వెళ్లి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ జోన్ పరిధిలోని ఇతర జిల్లాలతో పోల్చిచూసినప్పుడు విద్యా, ఉద్యోగాల పరంగానే కాదు ఏ రంగంలో చూసినా ఆసిఫాబాద్ కొంత వెనుకబడినా మంచిర్యాల జిల్లాయే ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇక నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలు బాసర జోన్ పరిధిలోకి వెళ్లాయి. ఈ జోన్లో ఇంకా జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. నిర్మల్ జిల్లా నిజామాబాద్, జగిత్యాల జిల్లావాసులతో పోటాపోటీగా ఉంటుంది. అన్ని రంగాల్లో ముందువరుసలో ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా కొంత వెనుకబాటుగా ఉన్నా లాభం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి.. నిరుద్యోగులు ఎక్కువగా లబ్ధిపొందే అవకాశాలు కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా రానున్నాయి. జోన్ వైశాల్యం భారీగా తగ్గడం వల్ల ఉద్యోగులకు చాలా మేలు చేకూరనుంది.
స్థానికులకే ఉద్యోగాలు
కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా మన ఉద్యోగాలు మనకే వచ్చే అవకాశముంటుంది. ముఖ్యంగా స్థానికేతరుల (నాన్లోకల్) కోటాలకు భారీగా కత్తర పడనున్నది. పాత జోనల్ వ్యవస్థలో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి కేడర్ వరకు స్థానికేతరులు భారీగా పోస్టులు తన్నుకొని పోయేవారు. కొత్త విధానం దీనికి అడ్డుకట్ట వేయనున్నది. గత జోనల్ విధానం ప్రకారం చూస్తే జిల్లా కేడర్లో 80:20 ఉండేది. అంటే వంద పోస్టులు పడితే అందులో 80 పోస్టులు స్థానికులకు, 20 పోస్టులు స్థానికేతర రిజర్వేషన్లుగా పరిగణించి భర్తీ చేసేవారు. అలాగే జోనల్ కేడర్లో 70:30 శాతం, బహుళ జోన్లో 60:40 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి. కొత్త విధానం ద్వారా ఈ వ్యవస్థ పూర్తిగా మారనుంది. జిల్లా, జోనల్, బహుళ జోన్ (గతంలో మల్టీజోన్)తోపాటు రాష్ట్ర స్థాయి కేడర్ల వ్యవస్థ పూర్తిగా మారనున్నది. జిల్లా, జోనల్, బహుళ జోన్ పరిధిలో జరిగే ప్రత్యక్ష నియామకాల్లో ఇక ముందు 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కనున్నాయి. ఆ లెక్కన గతంలో జరిగిన భర్తీ విధానంతో పోలిస్తే.. జిల్లా స్థాయి పోస్టుల్లో అదనంగా 15 శాతం పోస్టులు స్థానికులకే దక్కనున్నాయి. అలాగే, జోనల్ కేడర్లో 25 శాతం, బహుళ జోన్ పరిధిలో 35 శాతం పోస్టులు స్థానికులకు దక్కుతాయి. జిల్లా, జోనల్, బహుళ జోన్ పరిధిలో కేవలం ఐదు శాతం మాత్రమే స్థానికేతర రిజర్వేషన్లు ఉంటాయి. ఇందులోనూ మన స్థానికులు పోటీ పడవచ్చు. నిశితంగా చూస్తే.. కొత్త జోనల్ విధానం ద్వారా స్థానికేతర కోటాకు భారీగా కత్తెర పడి.. స్థానికులకే ఉద్యోగావకాశాలు 95 శాతం దక్కనున్నాయి.
ఈ విధానం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిరుద్యోగులు కొత్తగా చేపట్ట బోయే ఉద్యోగ నియామకాల్లో భారీగా లబ్ధిపొందనున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో రెండు మల్టీ జోన్లు ఉండేవి. ఇందులో 4, 5, 6 జోన్లు కలిపి మల్టీజోన్లుగా పరిగణించేవారు. ఆ లెక్కన మల్టీజోన్ పరిధిలోకి అంటే.. 4వ జోన్ పరిధిలో ఉన్న చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలో తెలంగాణలోని ఐదు, ఆరు జోన్ పరిధిలోకి వచ్చేవి. దీని ద్వారా మల్టీజోన్ పోస్టులు, రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లో ఎక్కువ శాతం వీరే ఉండేవారు. కొత్త విధానంలో తెరపైకి తెస్తున్న బహుళ జోన్ విధానంలో రాయలసీమ ఉండదు. కొత్తగా ఏర్పాటు చేసే మొదటి బహుళ జోన్ పరిధిలోకి కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి వస్తాయి. బహుళ జోన్ల పరిధికి వచ్చే సరికి మాత్రం ఉమ్మడి జిల్లా మొత్తం దీని పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఏ కోణంలో చూసినా కొత్త జోనల్ విధానం శాస్త్రీయంగా ఉండడమే కాదు, అందరికీ లబ్ధి కలుగనున్నది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 50 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీచేసే అవకాశాలున్నాయి. దీని ద్వారా భారీగా స్థానికులకే లబ్ధి చేకూరుతుంది. ఇదే సమయంలో మారుమూల ప్రాంత వాసులకు కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇన్నాళ్లూ జోనల్ వ్యవస్థ శాస్త్రీయంగా లేకపోవడం వల్ల ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల విషయంలోనూ కొంత అస్పష్టత ఉండేది. కొత్త జోన్లకు కేంద్రం ఆమోద ముద్రవేయడంతో అంతా శాస్త్రీయంగా ఉండనున్నది.
నిరుద్యోగులకు వరం
జోనల్ విధానంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి జోనల్ వ్యవస్థతో భౌగోళిక పరిధి తగ్గింది. గతంలో ఐదో జోనల్ వ్యవస్థలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలు భౌగోళికంగా చాలా దూరం ఉండేది. ఉద్యోగాలు సాధించిన వారు, ట్రాన్స్ఫర్ అయిన వారు ఇతర చోట్లకు వెళ్లాలంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం నిర్మల్ జిల్లా రెండో జోనల్ బాసర పరిధిలోకి వెళ్లింది. ఇందులో నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలతో ఏర్పడింది. ఈ జోన్ భౌగోళికంగా చాలా దగ్గరగా ఉంది. ఉద్యోగాలు సాధించిన వారితోపాటు బదిలీపై వెళ్లే ఉద్యోగులు సంతోషపడుతారు. ఈ జోనల్ వ్యవస్థ ఉద్యోగులతోపాటు, నిరుద్యోగులకు కూడా లాభం చేకూర్చుతుంది. – పీజీ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, నిర్మల్.