ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
బోధన్, ఏప్రిల్ 22: బోధన్ మున్సిపాలిటీ 18వ వార్డు ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గురువారం సాయంత్రం 3 గంటలకు ముగిసింది. మొత్తం 8 మంది వివిధ పార్టీల అభ్యర్థులుగా, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో నలుగురు అభ్యర్థులు గురువారం సాయంత్రానికి తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో నలుగురు అభ్యర్థులు మిగిలారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా కర్రోళ్ల గంగారాం అలియాస్ బెంజర్ గంగారాం, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రమోద్ అలియాస్ చిత్రాల చిన్నా, బీజేపీ అభ్యర్థిగా పెద్ద లాలయ్య, ఎంఐఎం అభ్యర్థిగా మదారి పద్మ పోటీ చేస్తున్నారు. ఈ జాబితాను మున్సిపల్ ఎన్నికల అధికారి గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఈ వార్డు ఉపఎన్నిక పోలింగ్ ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికను నిర్వహించనున్నారు. రీపోలింగ్ అవసరమైతే వచ్చే నెల 2న నిర్వహిస్తామని, 3న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.శ్రీనివాస్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఎం.వెంకటేశ్వరరెడ్డిని నియమించారు.
పాజిటివ్ ఓటర్లు, వృద్ధులు, వికలాంగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం..
విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు, సర్వీస్మెన్లకు మా త్రమే ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంది. కొవిడ్ పాజిటివ్ కేసులు ప్రబలుతున్న దృష్ట్యా 18వ వార్డు ఉప ఎన్నికల్లో కరోనా సోకిన ఓటర్లు, 80 ఏండ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కల్పించింది. వీరు పోస్టల్ బ్యాలెట్ కోసం శుక్రవారం నుంచి ఈ నెల 28 వరకు సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని, వారికి విడుదల చేసిన పోస్టల్ బ్యాలెట్ పత్రాలను బోధన్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బాక్స్లో వేయాలని మున్సిపల్ అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ జరిగిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ కోసం సంబంధిత సర్టిఫికెట్ను సమర్పించాలన్నారు. 80 సంవత్సరాల పైబడినవారు వయ స్సు నిర్ధారణ కోసం ఆధార్ కార్డును, వికలాంగులు వికలాంగుల ధ్రువపత్రాన్ని, ఎన్నికల విధులు కలిగినవారు సంబంధిత డ్యూటీ సర్టిఫికెట్లను సమర్పించాలని తెలిపారు.