ఉమ్మడి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు మొదలైంది. అందుకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెల 21వ తేదీ నాటికి తుది జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 31 సర్పంచ్ స్థానాలతోపాటు నాలుగు ఎంపీటీసీ, 1125 వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉండగా వీటన్నింటికీ త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి.
నల్లగొండ ప్రతినిధి, మార్చి31(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీల్లో త్వరలో ఎన్నికల సందడి నెలకొననుంది. ఈ నెలారంభంలో ఎన్నికలు నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లల్లో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో కీలకమైన ఓటర్ జాబితా సవరణపై దృష్టి సారించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఇప్పటికే విడుదల చేశారు. ఈ నెల 8న ముసాయిదా ఓటర్ జాబితాను ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రకటించి, అభ్యంతరాలను స్వీకరిస్తారు. 16 వరకు స్వీకరించి, 19 నాటికి అభ్యంతరాలను పరిష్కరిస్తారు. 21న తుది ఓటర్ జాబితాను ప్రకటించడంతో పాటు పోలింగ్ కేంద్రాలను గుర్తింపు ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. వీటితో పాటు ఈ నెల 12న జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఆయా రాజకీయపార్టీల ప్రతినిధులతో, 13న మండల స్థాయిలో ఆర్డీఓలు సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో 31 సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో నల్లగొండ జిల్లాలో 23, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో నాలుగు చొప్పున మొత్తం 8 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
నల్లగొండ జిల్లాలో నకిరేకల్ మండలంలో ఏడు గ్రామాలు గతంలో మున్సిపాలిటీలో విలీనం చేయగా కోర్టు ఉత్తర్వులతో వాటిని తిరిగి గ్రామ పంచాయతీలుగానే కొనసాగిస్తున్నారు. వీటికి కూడా ప్రస్తుతం ఎన్నికలు జరుగాల్సి ఉంది. మరోవైపు భారీగా వార్డుసభ్యుల స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇందులో మెజార్టీ స్థానాల్లో సభ్యులపై అనర్హత వేటు పడడంతో ఖాళీ అయ్యాయి. గత ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల వివరాలను సమర్పించకపోవడంతో వీరిని పదవుల నుంచి తొలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇలా మొత్తం 1,125 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహిస్తే పలుచోట్ల ఖాళీగా ఉన్న ఉప సర్పంచ్ స్థానాలకు సైతం ఎన్నికలు పూర్తి చేయనున్నారు. ఇక ఎంపీటీసీ సభ్యులకు సంబంధించి నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం తానేదార్పల్లి, మునుగోడు మండలం కొంపల్లి, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం తాళ్లమల్కాపూర్, వెల్దండ ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి కూడా త్వరలోనే ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతున్నది.