నేరేడుచర్ల/పాలకవీడు, ఏప్రిల్ 22 : అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని హుజూర్నగర్ ఆర్డీఓ వెంకారెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్ల మార్కెట్ యార్డులో, పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం తడిసిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందన్నారు. ఆయన వెంట డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, తాసీల్దార్ సరిత, డిప్యూటీ తాసీల్దార్ రాంరెడ్డి, ఏఓ వీరభద్రారావు, ఆర్ఐ ప్రవీణ్, జాని, సర్పంచ్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బృందావనపురం కొనుగోలు కేంద్రంలో..
నడిగూడెం : అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా తగిన చర్యలు తీసుకొనున్నట్లు కోదాడ ఆర్డీఓ కిశోర్కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని బృందావనపురం ఐకేపీ కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. వర్షపాతం తక్కువగా నమోదవడంతో నష్టం ఎక్కువగా లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా నిర్వహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాసీల్దార్ ఆనంద్బాబు కరివిరాల, సిరిపురం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసీల్దార్ జవహర్లాల్నాయక్, ఆర్ఐ గోపాలకృష్ణ, ఎంపీటీసీ గోలి సునీతావెంకటేశ్వర్లు, ఐకేపీ నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.
భక్తళాపురంలో పంటపొలాల పరిశీలన
పెన్పహాడ్ : అకాల వర్షంతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని సూర్యాపేట ఆర్డీఓ రాజేంద్రకుమార్ అన్నారు. మండలంలోని భక్తళాపురంలో బుధవారం కురిసిన వర్షంతో నష్టపోయిన పంట పొలాలను, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ నెమ్మాది భిక్షం, జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్తో కలిసి పరిశీలించారు. పంటనష్టం అంచనాపై ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. నివేదికను ప్రభుత్వానికి అందజేసి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు. పీఏసీఎస్ చైర్మన్లు జానకీరాంరెడ్డి, సీతారాంరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు రఫీ, తాసీల్దార్ శేషగిరిరావు, ఆర్ఐ మట్టయ్య, ఏఓ కృష్ణసందీప్, ఏపీఎం రాంబాబు పాల్గొన్నారు.