విధి నిర్వహణలో ‘వైరస్’ జాగ్రత్తలు తీసుకోవాలి
1700 మందితో పటిష్ఠపోలీసు బందోబస్తు
పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్
ఖమ్మం, ఏప్రిల్ 29: అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో కేఎంసీ ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పనిచేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పోలీసు సిబ్బందికి సూచించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధుల్లో సిబ్బంది పాటించాల్సిన విధివిధానాలు, భద్రతా ఏర్పాట్లపై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించేందుకు నగరంలోని ఎస్ఆర్ అండ్బీజీఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్, సప్తపది ఫంక్షన్ హాళ్లలో గురువారం నిర్వహించిన వేర్వేరు సమావేశాలు, అవగాహన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. బాధ్యతాయుతమైన ఎన్నికల విధి నిర్వహణతోపాటు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ క్షేమంగా ఇంటికి వెళ్లడం చాలా ముఖ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రధానంగా పోలింగ్ స్టేషన్, పోలింగ్ లొకేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేలా విధులు నిర్వహించాలని సూచించారు. ఫ్లయింగ్ స్కాడ్, రూట్ మొబైల్స్, స్టాటిస్టికల్ సర్వేలైన్స్ అధికారుల విధుల్లో పోలీసులు పాటించాల్సిన నియమాలపై రోల్ క్లారిటీ ఉండాలని అన్నారు. ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్స్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, అప్పగించిన బాధ్యతలపై మాత్రమే దృష్టి సారించాలని సూచించారు. ఏ చిన్న సంఘటన జరిగినా వెనువెంటనే ఆయా ప్రాంతాలకు చేరుకునే రూట్ మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్ మరింత వేగవంతంగా స్పందించే విధంగా పకడ్బందీ ప్రణాళికతో విధులు కేటాయించినట్లు వివరించారు. సుమారు 1,700 మంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారన్నారు. డీసీపీ నాయక్, అడిషనల్ డీసీపీలు సుభాశ్ చంద్రబోస్, ప్రసాద్, కుమారస్వామి, ఏసీపీలు ప్రసన్నకుమార్, ఆంజనేయులు, రమేశ్, వెంకటరెడ్డి, సత్యనారాయణ, జహంగీర్, విజయబాబు పాల్గొన్నారు.