గుమ్మడిదల, అక్టోబర్ 8 : కనుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఆలయ కమి టీ అధ్యక్షుడు మద్దుల బాల్రెడ్డి, ఆలయ వంశపార్యపరంకులు కేవీ. నర్సిహాచార్యులు, రంగనాథచార్యులు, సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి, ఆలయ కమిటీ ధర్మకర్తలు ఇందెల బాల్రెడ్డి, సూర్యనారాయణ, సత్యనారాయణ, పోచుగారి శ్రీనివాస్రెడ్డి భక్తులు పాల్గొన్నారు.
అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది
తూప్రాన్/ రామాయంపేట, అక్టోబర్ 8 : దుర్గామాత అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అమ్మవారిని ఏది కోరుకుంటే అదే జరుగుతోందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం తూప్రాన్కు విచ్చేసిన ఆయన దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దుర్గామాత కమిటీ నిర్వాహకులు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఎఫ్డీసీ చైర్మన్ మాట్లాడారు. 36 సంవత్సరాలుగా తూప్రాన్ పట్టణంలో దుర్గామాత విగ్రహ ప్రతిమను ప్రతిష్ఠించడం మంచి పరిణామమన్నారు. దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠ నిర్వాహకులు 56 మంది తమ భక్తిభావంతో దీక్షలు చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. అంతకుముందు ఆయన దుర్గామాత కమిటీ నిర్వాహకులను ఎఫ్డీసీ చైర్మన్ సన్మానించారు. సమావేశంలో కౌన్సిలర్లు శ్రీశైలంగౌడ్, మామిడి వెంకటేశం, నిర్వాహకులు తాటి విఠల్, మహేశ్గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సతీష్చారి తదితరులు పాల్గొన్నారు.
గాయత్రీమాతగా వర్గల్ సరస్వతీ దేవి
వర్గల్, అక్టోబర్ 8 : వర్గల్ విద్యాధరిణి చదువులతల్లి సరస్వతీమాత శుక్రవారం శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు గాయత్రీమాతగా దర్శనమిచ్చింది. ఉత్సవాల్లో రెండోరోజూ శుక్రవారం ఉదయం అమ్మవారి ఆలయంలో ఉత్సవపూజతో సహా పలు క్రతువులు వేదపండితుల మంత్రోచ్ఛారణలతో మారుమోగాయి. విశేష అభిషేకాలు నిర్వహించారు. గాయత్రీమాత రూపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. భక్తులు తీర్థప్రసాదాల స్వీకరణ అనంతరం అన్నదానంలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు నేడు లలితాదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
గాయత్రీదేవిగా భద్రకాళి అమ్మవారు..
గుమ్మడిదల, అక్టోబర్ 8 : దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వీరభద్రస్వామి ఆలయంలో భద్రకాళి అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం మండలంలోని బొంతపల్లి వీరన్నగూడెంలోని వీరభద్రస్వామి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ గటాటి భద్రప్ప, ఈవో శశిధర్గుప్తా ఆధ్వర్యంలో ఈ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కానుకుంటలో సప్తమాత్రిక సమేత మహంకాళి ఆలయంలోని అమ్మవారు గాయత్రీదేవిగా, వీరభద్రనగర్ కాలనీలో మార్వడి సోదరులు ఏర్పాటు చేసుకున్న దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో సర్పంచ్ ఆలేటి నవీనాశ్రీనివాస్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ గటాటి భద్రప్ప, ఉపసర్పంచ్ సంజీవరెడ్డి, నాయకులు వినోద్గౌడ్, చక్రపాణి,గ్యారల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.