సొంత వైద్యంతోనే కరోనా విజృంభణ
పరీక్షలు చేసుకోకపోవడంతో సామాజిక వ్యాప్తి
మాస్కులు వాడక బయట తిరిగే వారితోనే పెనుముప్పు
బోథ్, ఏప్రిల్ 21 : అలసత్వం కరోనా రూపంలో ఆయువు తీస్తున్నది. సొంత వైద్యంతోనే వ్యాధి విజృంభిస్తున్నది. లక్షణాలున్నా నిర్ధారణ పరీక్షలు చేసుకోకపోవడం మూలంగానే వేగంగా విస్త్తరిస్తున్నది. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, కడుపులో నొప్పి వంటి లక్షణాలున్నా చాలా మంది గ్రామ స్థాయిలో ఉండే ఆర్ఎంపీ, పీఎంపీలను సంప్రదిస్తున్నారు. వారు చికిత్స మొదలు పెట్టి నాలుగైదు రోజులు గడిచినా అదపులోకి రాక పై ఆసుపత్రులకు పంపుతున్నారు. దీంతో వ్యాధిగ్రస్తులు ప్రా ణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. దగ్గుతో వ్యాధి ఊపిరితిత్తులకు వ్యాపించడంతో పరిస్థితి విషమించి చనిపోతున్నారు. కొవిద్ మరణాల్లో 90 శాతం వరకు ఇలాంటి కేసులే ఉంటున్నాయని డాక్టర్లు పేర్కొంటున్నారు.
కరోనా మొదటి విడుత..
ఏడాది కిత్రం వచ్చిన వెలుగులోకి వచ్చిన కరోనా మొదటి విడుత సమయంలో రోగిలో జ్వరంతో పాటు జలుబు వంటి లక్షణాలు కనిపించేవి. ఇంట్లో ఒకరికి వ్యాధి వచ్చినా డాక్టర్లను సంప్రదిం చి చికిత్స చేసుకుంటే నయమయ్యేది. వ్యాధి వ్యాప్తి నెమ్మదిగా ఉండేది. అందుకే అప్పుడు మరణాల సంఖ్య తక్కువగా ఉంది.
రెండో విడుత..
కరోనా వ్యాధి తీవ్రత రెండో విడుతలో ఎక్కువగా ఉంది. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, జీర్ణాశయంలో నొప్పి వంటి లక్షణాలు కొందరిలో, మరికొందరిలో ఎలాంటి లక్షణాలు పైకి కనిపించడం లేదు. కానీ లోలోపల వ్యాధి తీవ్రమవుతున్నది. రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నవారు తట్టుకుంటున్నారు. మిగిలిన వారు తీవ్ర అనారోగ్యం పాలై మృత్యువాతపడుతున్నారు.
జ్వరం వస్తే డాక్టర్లను సంప్రదిస్తే మేలు..
జ్వరం వస్తే వెంటనే సమీప దవాఖానల్లోని డాక్టర్లను సంప్రదిస్తే మేలు. వారు రోగి పరిస్థితిని బట్టి మందుల వాడకంతో పాటు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించి పాజిటివ్ వచ్చిన వారికి తదనుగుణంగా చికిత్సలు అందిస్తారు. చాలా మంది జ్వ రం వచ్చినా మూడు, నాలుగు రోజుల వరకు ఇం డ్లలోనే వైద్యం తీసుకుంటున్నారు. సరైన మందు లు వాడక ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నా రు. వయస్సు పైబడిన వారు తనువు చాలిస్తున్నారు.
కుటుంబంలో ఒకరికి సోకితే..
కుటుంబంలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే మిగతా వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోగిని ప్రత్యేక గదిలో ఉండేలా చూసుకోవాలి. వ్యాధిగ్రస్తుడితో పాటు అందరూ మాస్కులు ధరించాలి. రోగికి ఆహారంతో పాటు సమయానికి మందులు అందించాలి. 12 నుంచి 14 రోజుల వరకు తప్పనిసరిగా హోంక్వారంటైన్లో ఉండేలా చూసుకోవాలి.
మందులు వాడుతూ పరీక్షిస్తే నెగెటివ్..
కరోనా వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తి రెండు, మూడు రోజుల పాటు సూచించిన మందులు వాడాలి. మళ్లీ నిర్ధారణ పరీక్ష చేసుకుంటే నెగెటివ్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు. అలాంటి వ్యక్తుల నిర్లక్ష్యం మూలంగా మిగతా వారికి, కుటుంబీకులకు వ్యాధి వ్యాపించే ప్రమా దం ఉందంటున్నారు. ఒకసారి వ్యాధి సోకిన వారు కనీసం 12 రోజులైనా హోం క్వారంటైన్, ఐసొలేషన్లో ఉంటే మేలని సూచిస్తున్నారు.