మెదక్, అక్టోబర్ 8 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పలు పథకాలు ఇప్పటికే దేశం దృష్టిని ఆకర్షించాయి. మెదక్ జిల్లాలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయి. రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ లాంటి పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది.
మెదక్ జిల్లాలో రైతుబంధు పథకం కింద ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు రూ.5వేల చొప్పున ఈ వానకాలంలో మొత్తం 2,35,159 మందికి గాను రూ.197.74 కోట్లు ప్రభుత్వం జమచేసింది.
రైతుబీమా పథకం 18-59 ఏండ్ల వయస్సు కలిగిన రైతులకు రూ.5 లక్షల చొప్పున బీమాను వర్తింపజేస్తున్నది. 2020-21గాను ఇప్పటి వరకు 1246 మంది రైతులు మరణించగా, ఒక్కో రైతు నామినీ ఖాతాల్లో రూ.5 లక్షల చొప్పున రూ.62.30 కోట్లు ప్రభుత్వం జమచేసింది. 2021-22 సంబంధించి 1,49,210 మంది రైతులకు రైతుబీమా నమోదుకు అవకాశం కల్పించింది.
ఆసరా పథకం కింద 1,03,746 మందికి లబ్ధిదారులకు ప్రతినెలా పింఛన్ల రూపంలో రూ.22.56 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేస్తున్నది.
మాతా శిశు మరణాలను నియంత్రించడంలో భాగంగా తెలంగాణ అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ పంపిణీ విజయవంతంగా అమలవుతున్నది. ప్రభుత్వ దవాఖానలో ప్రసవించిన తల్లికి కేసీఆర్ కిట్తో పాటు వాయిదా పద్ధతిలో మొత్తం రూ.12 వేలు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఆడపిల్ల పుడితే రూ.13వేలు ఇస్తున్నది. మెదక్ జిల్లాలో కేసీఆర్ కిట్ పథకం కింద 2017 జూన్ 2 నుంచి 2021 ఆగస్టు 31 వరకు 21,198 మందికి కేసీఆర్ కిట్ ఇచ్చారు.
పేదింటి యువతుల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. 2020-21 సంవత్సరానికి ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా 5,361 మంది లబ్ధిదారులకు, షాదీముబారక్ పథకం ద్వారా 223 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ.లక్షా 116 చొప్పున ప్రభుత్వం అందించింది.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు
ప్రభుత్వం రైతుబంధు, ఆసరా పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఇటీవల మా బిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి డబ్బులు ఇచ్చింది. మాలాంటి వారికి ఎంతో అండగా ఉంటుంది ఈ సర్కారు. పేదల కోసం ఎన్నో చేస్తున్రు. రైతులు బాగుకోసం రైతుబంధు, రైతుబీమా ఇత్తున్రు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సార్లకు కృతజ్ఞతలు.
-దారం దేవవ్వ (నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది)
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసిన కానీ గిలాంటి ప్రభుత్వం చూడలేదు. నాకు తెలిసి తెలంగాణలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఏదో రకంగా సాయం అందిస్తూనే ఉంది. నాకు గీత కార్మికుడి పింఛన్, మా భార్యకు బీడీల పింఛన్, నా బిడ్డ సౌజన్యకు పెండ్లి చేస్తే కల్యాణలక్ష్మి వచ్చింది. మా బిడ్డ డెలివరీకి అకౌంట్లో పైసలు వేయడంతో పాటు కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటి దగ్గర దించిపోయారు. రైతుబంధు కూడా వస్తున్నది. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదంటారు. అడగకుండానే గిన్ని రకాలుగా అదుకుంటున్న ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-ఆకుల కనకయ్యగౌడ్, గీతకార్మికుడు, మర్రిముచ్చాల