కరోనా కష్టకాలంలో రెండు నెలలకు ఉచితంగా బియ్యం సరఫరా
కలెక్టరేట్, మే 1: పేదలకు ఉచిత బియ్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా విలయ తాండవం చేస్తున్న క్రమంలో ఆహార భద్రత కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు రానున్న రెండు నెలల్లో ఒకరికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం అందించే బియ్యం కూడా పేదలకు ఊరటను ఇవ్వనున్నది. గత ఏడాది కరోనా మొదటి వేవ్లో సీఎం కేసీఆర్ పేదలకు రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ఉచితంగా ఒక్కొక్కరికీ 12కిలోల బియ్యం అందించారు. దీంతో పాటుగా వలస కూలీలకు కూడా ఉచితంగానే పంపిణీ చేశారు. రెండో దశలో కూడా పేద కుటుంబాలకు బియ్యం సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. టీఆర్ఎస్ సర్కారు ఓ వైపు వైరస్ నియంత్రణకు పరీక్షలు, వ్యాక్సినేషన్లు, ఉచితంగా అందించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 344 రేషన్ దుకాణాలు
జిల్లాలో 1,59,157 ఆహార భద్రత కార్డులు ఉండగా, 4,68,670 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. 13,613 అంత్యోదయ ఆహార భద్రత కార్డులు ఉండగా 35,547 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. 232 అన్నపూర్ణ కార్డులుండగా 236 మంది సభ్యులు ఉన్నారు. కరోనా ఫస్ట్ వేవ్లో ఒక్కో సభ్యుడికి ఆహార భద్రత ద్వారా 12 కిలోల బియ్యం సరఫరా చేయగా, అంత్యోదయ కార్డుల ద్వారా కుటుంబానికి 35 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేశారు. అన్నపూర్ణ కార్డు ద్వారా ప్రతి కుటుంబానికి 12 కిలోల బియ్యం అందించారు. జిల్లాలో 173,002 లబ్ధి పొందుతున్న కుటుంబాలు ఉండగా, 5,04,453 మంది సభ్యులు ఉన్నారు. గతేడాది లాక్డౌన్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 8,225 వలస కార్మిక కుటుంబాలకు 12 కిలోల బియ్యం, రూ.500 అందించారు. దీంతో కరోనా కష్టకాలంలో కూడా సీఎం కేసీఆర్ వారిని ఆదుకున్నారు. అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం రానున్న మే, జూన్ నెలల్లో పేదలకు 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నది.