Lakshmi Narasimha Swamy | కల్యాణోత్సవం భగవంతుడి అవతారాలు పైకి ఒకలా కనిపిస్తాయి. లోతుగా విశ్లేషిస్తే.. అందులో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయనిపిస్తాయి. స్తంభ సంభవుడైన నరసింహుడి విచిత్రాకృతి విశేషమైనది. ఆయన సంహరించిన అసురుడి తత్వం విశృంఖలమైనది. స్వామి ఉద్ధరించిన ప్రహ్లాదుడి భక్తి విభిన్నమైనది. ఉగ్ర నరసింహుడిని శాంతపరచిన లక్ష్మీ కటాక్షం విస్తారమైనది. యాదగిరిగుట్టపై లక్ష్మీదేవిని మనువాడుతున్న నరసింహుడి ఆవిర్భావ ఘట్టం పౌరాణికంగా అందమైన కథ! సాంకేతికంగా పరికిస్తే.. అద్భుతమైన గాథ!
శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే
భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధి పోత
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్
విష్ణు సంబంధమైన అవతారాల్లో హిరణ్యకశిపుని నుంచి ప్రహ్లాదుని రక్షించిన స్వామి, గిరిజనుల నుంచి పురజనుల వరకు అందరికీ ఆరాధనీయమైన దైవం లక్ష్మీ నరసింహస్వామి. నవ నారసింహ స్వాముల రూపంలో ఆరాధనలు అందుకుంటున్న స్వామి ఆయన. ఉగ్ర నారసింహ, కృద్ధ నారసింహ, వీర నారసింహ, విలంబ నారసింహ, కోప నారసింహ, యోగ నారసింహ, అఘోర నారసింహ, సుదర్శన నారసింహ, శ్రీలక్ష్మీ నారసింహ స్వామి అనే అర్చావతారాల రూపంలో పూజలు పొందుతున్న స్వామి అవతారం వెనుక అంతరార్థాలు ఎన్నెన్నో….
మన భూమిని రక్షించడానికి భూమి చుట్టూ ఓజోన్ పొర ఒకటి ఉంటుంది. మిగిలిన ఏ గ్రహాలకు కూడా లేని సౌకర్యం ఇది. ఈ పొరను వైదిక వాఙ్మయం ‘హిరణ్య ప్రాకారం’ అనే పేరుతో పిలిచింది. ఈ పొరను కలిగి ఉన్న శక్తికి ‘హిరణ్మయి’ అనే పేరు పెట్టుకున్నారు. ఈ పొరకు ఏదైనా అవరోధం ఏర్పడితే వెంటనే ఇబ్బంది పడేది భూమి, దాని మీద ఉండే జీవరాశులు. మొదట్లో ఈ పొర కొంత భూమికి సన్నిహితంగా ఉండి కొన్ని జీవులు మాత్రమే ఈ నేల మీద ఉద్భవించాయి. అప్పటికి పెద్ద జీవుల ఆవిర్భావం అయ్యే అవకాశం కలుగలేదు. ఈ పొరకు ఒకానొక సందర్భంలో ఇబ్బంది కలిగింది. మళ్లీ భూభ్రమణ, పరిభ్రమణాల వల్ల, సూర్య తేజస్సువల్ల ఆ సమస్య తొలగింది. ఈ విషయాన్ని సాధారణ జనానికి అర్థం అయ్యే విధంగా తెలియజేయడానికి కొన్ని పాత్రల ద్వారా పురాణం వివరించింది. ఈ విషయాలను తెలియజేసే పురాణ గాథలే వరాహ, నరసింహస్వామి ఆవిర్భావ గాథలు.
పూర్వం హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులనే రాక్షసులు హిరణ్య ప్రాకారాన్ని (ఓజోన్ పొరను) తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు. దానికి రంధ్రాలు చేసి సూర్యుడి అతినీలలోహిత కిరణ ప్రసారాలను భూమికి చేర్చేందుకు, సూర్యకిరణాలు భూమికి చేరకుండా ఉండేందుకు ప్రయత్నించారు. భూమి అనే ప్రహ్లాదుని అతలాకుతలం చేసే ప్రయత్నం చేసినవారు వీరిద్దరు. అయితే ప్రహ్లాదుడు మూలశక్తి అయిన సూర్యుడి శక్తిని (నరసింహస్వామి) ఉపాసించడం ద్వారా రక్షణ పొంది, తనను ఇబ్బంది పెట్టిన రాక్షసులను శక్తి సహకారంతో పారద్రోలి, ప్రశాంతంగా ఉండగలిగినాడు. ఇదే నరసింహస్వామి ఆవిర్భావ గాథ.
ఇక్కడ సూర్యుడు, సూర్యశక్తి, వెలుగు, వేడిమి అన్నీ నరసింహస్వామికి ప్రతీకలే. నరసింహునిలోని నరత్వం భూమి అయితే, సింహత్వం సూర్యునిది. సింహానికి ఉన్న జూలు లాంటిదే సూర్య కిరణాలు. నరసింహస్వామి అష్టోత్తర నామాలు చదివితే ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. సూర్యతత్త్వం, నరసింహ తత్త్వం సమానంగా ఉంటుంది. అందుకే అనేక రూపాల్లో నరసింహస్వామి… సూర్యుడికి ప్రతీకగా కనిపిస్తాడు. జ్వాలా నరసింహ, యోగ నరసింహ, గండభేరుండ నరసింహ, వైద్య నరసింహ, లక్ష్మీ నరసింహ వంటి పేర్లన్నీ సూర్య సంబంధమైన అధ్యయనంలో తెలుస్తుంటాయి. జ్వాలా నరసింహ భావన సూర్యుడి తీవ్రమైన అగ్ని జ్వాలలు. యోగ నరసింహ భావన కూడా తన చుట్టూ ఎందరో ఉన్నా, తాను తనలో లీనమై శక్తిమంతుడు కావడం, ఏకోన్ముఖుడు కావడం అనే విషయాన్ని తెలియజేస్తుంది. కోప, కృద్ధ, యోగ, వీర, అఘోర, సుదర్శన రూపాలన్నీ మనకు అర్థం అవుతూనే ఉన్నాయి. వీటన్నిటిలోనూ ప్రత్యేక విధానం లక్ష్మీనరసింహం. ఈ లక్ష్మీ రూపం ప్రత్యేకత ఏమిటో మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది.
సూర్య కిరణాలు భూమికి చేరాలంటే భూమి ఉద్ధరణ జరగాలి. అంటే జలం నుంచి బయటపడాలి. ఓజోన్ పొర సరైన విధంగా ఉంటే ఆ సూర్యకిరణాలు ఫిల్టర్ అవుతాయి. అప్పుడే సరైన వేడి భూమికి కలుగుతుంది. లేకుంటే భూమి విపరీతమైన వేడికి గురికావడమో, జలంలో మునిగిపోవడమో జరుగుతుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా భూమి ఉద్ధరణ సాధ్యం కాదు. ఈ అంశంలో కీలక పాత్ర పోషించేది, ఓజోన్ పొర. అది లేకుంటే భూమికి మనుగడే లేదు. ఇక్కడ భూమి ప్రహ్లాదుడు. ఓజోన్ పొర లక్ష్మీదేవి. సూర్యుడు నరసింహస్వామి. హిరణ్యకశిపుడు భూమి, ఓజోన్ పొరలను పాడు చేసేవాడు. సూర్యశక్తిని లెక్కించని వాడు. ఈ రూపంలో ప్రతీకవాద సాహిత్యాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వ్యతిరేకతలన్నిటినీ ఉక్కుపాదంతో, వజ్రనఖాలతో తొలగించే తత్వం నరసింహ తత్వం. అయితే సూర్యరశ్మి పూర్తిగా భూమికి చేరి, భూమి మీద సకల సంపదలు నాశనం కాకుండా, రక్షించబడటానికి ఏర్పడిన ఓజోన్ పొర (హిరణ్య ప్రాకారం) లోపలి వాతావరణమంతా శ్రీలక్ష్మీ మయం. సూర్యకిరణాలు ఓజోన్ పొర ద్వారా భూమికి చేరుతాయి. ఈ రకమైన కిరణ ప్రసారం వల్లనే భూమి చల్లబడుతుంది. అందుకే ఆ ఓజోన్ పొరకే లక్ష్మీదేవిగా నామకరణం జరిగింది. ఆ పొరే లేకుంటే భూమి అనే ప్రహ్లాదుడు కూడా ఇబ్బంది పడేవాడు.
సాహిత్యంలో శ్రీదేవీ రూపం ఏదైనా, విష్ణువు పక్కన లక్ష్మీదేవి రూపంలో కనిపిస్తున్న అమ్మవారి రూపం కాని, శ్రీమాత, పార్వతి అనే అన్ని రూపాలు కూడా ఈ ఓజోన్కు సంబంధించినవే. ఈ రూపం హిరణ్మయీ రూపం. పాంచభౌతిక శక్తికి ప్రతిరూపం. ఈ రూప ఆరాధన మనకు విశేష ఫలితాన్నిస్తూ ఉంటుంది. సూర్యుడిని తండ్రిగా, ఓజోన్ పొరను తల్లిగా భావించే సంప్రదాయంతో అనేక కథలు, కథనాలు వెలువడ్డాయి. శ్రీ అనే శబ్దం కూడా అమ్మవారికి, ఓజోన్ పొరకు, ఆక్సిజన్కు సంకేతంగా వినియోగించడం సంప్రదాయం. అందుకే అన్ని ప్రత్యేక సందర్భాల్లో శ్రీ అనే శబ్దాన్ని వాడటం భారతీయ సంప్రదాయం. అందుకే శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన వల్ల మన చుట్టూ రక్షణ ఏర్పడటమే కాకుండా, ఏర్పడే వ్యతిరేకతలు తొలగిపోవడం జరుగుతుంది. ఈ భూమిలాగే మనకూ ఆనందప్రాప్తి కలుగుతుంది.
– సాగి కమలాకర శర్మ