Yadadri Temple | కొండంత దైవం కనురెప్పపాటు కనిపిస్తేనే తన్మయులం అవుతాం. కన్నులు దోచిన దృశ్యాన్ని మనోఫలకంపై ముద్రించుకొని.. తలచుకుని తలచుకుని మురిసిపోతాం. అలాంటిది సదా స్వామి చెంతనే ఉంటూ.. మూలమూర్తికి తిలకం దిద్దుతూ, హారతులిస్తూ, అర్చనలు చేస్తూ అనుక్షణం పొంగిపోతుంటారు అర్చకస్వాములు. స్వామివారి కైంకర్యాలు శాస్త్రబద్ధంగా నిర్వహించడంలో వారిది ప్రధాన పాత్ర. దశాబ్దాలుగా నరసింహుడి సన్నిధిలో సకల సేవల్లో భాగం అవుతున్న ప్రధాన అర్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు. యాదాద్రి క్షేత్రం పునరుద్ఘాటన సందర్భంగా ఆయన మనసులో మాట..
1969లో మొట్టమొదటిసారిగా యాదాద్రికి నా మేనల్లుడి పుట్టు వెంట్రుకల కార్యక్రమానికి వెళ్లాను. స్వామివారిని దర్శించుకోవడం అదే మొదటిసారి. 1977లో స్వామివారి దేవస్థానంలో ఆగమ పాఠశాలలో పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అభ్యసించాను. మా గురువుగారు గోవర్ధన నరసింహచార్యులు. పాంచరాత్ర ఆగమ శాస్త్రంతోపాటు వేద, పురాణేతిహాస ప్రవచన శక్తిని మా గురువుగారు అనుగ్రహించారు. కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామివారి చాతుర్మాస దీక్ష సందర్భంగా పాంచరాత్ర ఆగమ శాస్త్రం, స్మార్త ఆగమశాస్త్రాన్ని వారి ముఖతః అధ్యయనం చేశాను. 1977లో నల్లగొండలో రామాలయంలో అర్చకుడిగా పనిచేశాను. 1979 డిసెంబర్ 13న యాదగిరిగుట్ట దేవస్థానంలో అర్చకుడిగా అవకాశం వచ్చింది. అందుకే నన్ను అందరూ నల్లగొండ అయ్యగారు అని పిలుస్తుంటారు. నాటినుంచి స్వామివారి సన్నిధిలో శాస్త్రాధ్యయనం చేస్తూ, క్రమశిక్షణతో అర్చకత్వాన్ని కళాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్నాను. అర్చకుడిగా, సహాయ అర్చకుడిగా చేసి ప్రస్తుతం ప్రధాన అర్చకుడిగా సేవలు అందిస్తున్నాను.
1979లో ఈ క్షేత్రంలో ఎనిమిది మంది అర్చకులు, ఒకరిద్దరు వంటస్వాములు మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం 25 మంది అర్చకులం స్వామివారి కైంకర్యాలలో భాగస్వాములుగా ఉన్నాం. ఆలయ పునఃప్రారంభంతో అర్చకుల సంఖ్య 50కి పెరిగే అవకాశం ఉంది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం గొప్పగా జరిగింది. అదేస్థాయిలో పూజా కైంకర్యాలు, సహస్ర ఘటాభిషేకాలు, విశేషమైన పూజలూ నిర్వహిస్తాం. స్వామివారి నిత్య నైవేద్యం, విశేషమైన ప్రసాదాలు తయారుచేసే ఏర్పాట్లూ సాగుతున్నాయి.
స్వామివారికి ఇప్పటికే 365 రోజుల్లో 125 రకాలైన పూజలను నిర్వహిస్తున్నాం. మరో 100 రకాల పూజలను భక్తుల సౌకర్యం కోసం ప్రవేశపెడతాం. శాస్త్రంలో పేర్కొన్న ఉత్తమాభిషేకాలు, మధ్యమాభిషేకాలు, ఉత్తమోత్తమ అభిషేకాలు, ఉత్తమ మధ్యమాభిషేకాలు, నక్షత్రపూజలు, వైకుంఠపూజలు, అధ్యయనోత్సవాలు, ప్రబంధోత్సవాలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, యంత్రోత్సవాలు, పవిత్రోత్సవాలు ఇలా నూతన పూజలకు శ్రీకారం చుడతాం.
యుగయుగాల దైవం యాదాద్రీశుడు. పురాణేతిహాసాల్లోనూ ఈ క్షేత్ర వైభవం కనిపిస్తుంది. శతాబ్దాల నుంచి యాదాద్రి ఆలయం పాలకుల అధీనంలోనే ఉంటూ వచ్చింది. కాకతీయులు, కల్యాణి చాళుక్యులు, పల్లవ రాజులు, విష్ణు కుండినులు ఇలా ఎందరో రాజులు ఈ ఆలయాన్ని పోషించారు. శ్రీకృష్ణదేవ రాయలు యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు చేసినట్లు చెబుతారు. మత సామరస్యానికి ప్రతీకగా నిజాం నవాబులు సైతం యాదాద్రి ఆలయ నిర్వహణలో భాగమయ్యారు. గతంలో లక్ష్మీనరసింహస్వామికి త్రికాల అర్చనలు మాత్రమే చేసేవారు. విశేష పూజలు తక్కువగా ఉండేవి. ఆలయ ఆదాయం పెరుగుతున్న క్రమంలో విశేష పూజలు కూడా పెరుగుతూ వచ్చాయి. అప్పట్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు కేవలం మూడు రోజులు మాత్రమే జరిగేవి. అధ్యయనోత్సవాలు కూడా మూడు రోజులు మాత్రమే చేసేవారు. ప్రస్తుతం స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా దైవాన్ని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవడం సంప్రదాయం. కానీ, యాదాద్రిలో ఇప్పటివరకు ఆ సౌకర్యం లేదు. పునర్నిర్మాణంలో భాగంగా ఉత్తర ద్వారాన్ని ఏర్పాటుచేయడం విశేషం. ఈ దఫా తొలి ఏకాదశి సందర్భంగా నరసింహుడి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం లభించనుంది.
అడిగిన క్షణమే వరాలను అనుగ్రహించే దైవం యాదాద్రి లక్ష్మీనరసింహుడు. నరసింహ అవతారం నవగ్రహ స్థానానికి ఆధిపత్యం, ఆచార్యత్వం వహించినదిగా చెబుతారు. కుజరూపం స్వయంగా నరసింహుడే అని ప్రమాణం. వీటిని అనుసరించి స్వామి నామాన్ని జపిస్తే చాలు జన్మాంతరాలు, లగ్నాంతరాలు, యోగాంతరాలలో కుజగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ‘సంతాన దాన దీక్షాయ సంతానాయ ఫలార్థినాం కౌసల్యా ముఖ్య సంతాన రూపిణే శుభమంగళం’ అని సుప్రభాతంలో ప్రతీరోజూ స్వామివారిని ప్రస్తావిస్తాం. వంశాభివృద్ధి జరగాలంటే నరసింహస్వామిని ప్రార్థించాలని ప్రమాణం. వేదమూర్తి అయిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సంతాన ప్రదాత.
భక్తుల ధార్మికమైన కోర్కెలను స్వామి తప్పక నెరువేరుస్తాడు. భక్తులకు స్వప్నంలో దర్శనమిచ్చి వారి రోగ, గ్రహ, గృహ, పిశాచ బాధలను తొలగిస్తాడు. మంత్ర, యంత్ర, తంత్ర, ఫల చికిత్స చేస్తాడు. చాలామంది అనుభవపూర్వకంగా ఆయన అనుగ్రహాన్ని పొందారు. స్వామివారికి అభినవ వైద్యుడు అని పేరు.
ఆరోగ్య ప్రదాత, ఐశ్యర్యాన్ని అనుగ్రహించే స్వామి లీలలు అద్భుతాలు!