Maha Shivaratri | శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఈ పర్వదినాన పగలంతా ఉపవాసం ఉండి.. రాత్రిపూట శివనామ స్మరణలతో జాగరణ చేయడంతో పాటు శివలింగాన్ని బిల్వ పత్రాలతో అభిషేకిస్తే శివానుగ్రహం దక్కుతుందని చెబుతారు. సంవత్సరమంతా నిత్య శివ పూజ చేసిన ఫలం దక్కుతుందని అంటారు. అంత విశిష్టత కలిగిన మహాశివరాత్రి పండుగను జరుపుకోవడం ఎలా మొదలయ్యింది? అసలు శివ లింగం ఎలా ఉద్భవించింది. దీని వెనుక పురాణాల్లో ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. అదేంటంటే..
పూర్వం బ్రహ్మ, విష్ణుమూర్తిలకు తమలో ఎవరంటే గొప్ప అనే పోటీ తలెత్తింది. వాదనలతో మొదలైన ఆ గొడవ సంగ్రామం దాకా వెళ్లింది. ఒకరిపై ఒకరు భీకర అస్త్రాలను ప్రయోగించున్నారు. దీంతో ఆందోళన చెందిన దేవతలు మహాశివుడి దగ్గరికి వెళ్లి బ్రహ్మ విష్ణువు మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించాలని కోరతారు. అప్పుడు బ్రహ్మ, విష్ణువు మధ్యలో మిరుమిట్లు గొలిపే తేజస్సుతో ఒక స్తంభంలా పెద్ద లింగం ఆవిర్భవించింది. ఆ లింగం మొదలు, చివర ఎవరు తెలుసుకుంటే వారే అధికులని శివుడు చెబుతారు. దానికి సరేనంటూ లింగం ఆద్యంతాలను తెలుసుకునేందుకు బ్రహ్మదేవుడు హంస రూపంలో, విష్ణువు వరాహ రూపంలో బయల్దేరి వెళ్లారు. ఎంతసేపు ప్రయాణించినా ఇద్దరికీ ఆది అంతాలు తెలియలేదు. దీంతో విష్ణుమూర్తి వచ్చి తాను కనుక్కోలేకపోయానని ఒప్పుకుంటాడు.
కానీ బ్రహ్మ మాత్రం తానే అధికుడిని అని నిరూపించుకునేందుకు అబద్ధం చెబుతాడు. లింగం అంతం కనుక్కునేందుకు వెళ్లిన సమయంలో పై నుంచి రాలుతూ కనిపించిన కేతకీ( మొగలి) పుష్పాన్ని, గోవును తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని అడుగుతాడు. బ్రహ్మ మాట ప్రకారమే మొగలి పుష్పం సాక్ష్యం చెబుతుంది. గోవు కూడా తలతో అవును అనే సమాధానమే చెప్పినా.. తోకతో కాదన్నట్టుగా ఊపుతుంది. దీంతో అసలు విషయం అర్థం చేసుకున్న మహా శివుడు ఆగ్రహంతో బ్రహ్మదేవుడికి భూలోకంలో ఆలయం ఉండరాదని శపిస్తాడు. అలాగే కాలభైరవుడిని రప్పించి బ్రహ్మ ఐదు తలల్లో అబద్ధం చెప్పిన తలనుఖండించమని ఆదేశిస్తాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతకీ పుష్పాన్ని పూజలో వాడకూడదని ఆజ్ఞాపిస్తాడు. ఇక విష్ణువు లింగం ఆదిని చూడలేదని నిజం చెప్పడంతో ఆయన నిజాయతీకి మెచ్చి తనతో సమానంగా పూజలు అందుతాయని అనుగ్రహిస్తాడు. భూమిపై క్షేత్రాలు కూడా ఉంటాయని చెబుతారు.
పైన చెప్పిన సందర్భంలో పరమశివుడు మాఘ కృష్ణ చతుర్ధశి రోజున కోటి సూర్యకాంతులతో శివలింగ రూపంలో ఆవిర్భవించిన అర్ధరాత్రే శివరాత్రి. శివునకు అత్యంత ప్రీతిపాత్రమైన రాత్రి. ఈసందర్భంగా శివుడ్ని బిల్వపత్రాలతో పూజించి, అభిషేకాది అర్చనలు చేయాలి. రోజంతా ఉపవాస వ్రతాన్ని పాటించాలి. రాత్రి జాగరణ చేస్తూ నాలుగు జాముల్లో అభిషేకించాలి. మరుసటిరోజు శివపూజ చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి.
మహా శివరాత్రి పర్వదినం రాత్రి 11 గంటలకు లింగోద్భవకాలాన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారికి జరిపే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకానికి ప్రత్యేకత ఉంది. మహాన్యాసాన్ని చేస్తూ ముందుగా తమదేహంలోని కొన్ని ఇంద్రియాలను తాకుతూ రుద్రమంత్రాలను చదువుతూ రుద్రుడిని అందులోకి ఆహ్వానిస్తారు. అతడు పరిపూర్ణంగా రుద్రుడి రూపాన్ని దాల్చిన తర్వాత యజుర్వేదంలోని రుద్రం, నమకచమక మంత్రాలను ఉచ్చరిస్తూ అభిషేకిస్తారు. ఇందు లో నమకచమకాలని ఒకసారి చెప్పి చేసేది ఏకాదశ రుద్రాభిషేకం.
అలాగే 11సార్లు నమకాన్ని పఠించి ఒకసారి చమకాన్ని చదివి చేసేది ఏకాదశ రుద్రాభిషేకం. ఈ ఏకాదశ రుద్రాభిషేకం ఏకాదశ రుద్రులకు ప్రతీక. ఒక్కో అభిషేకంలో ఒక్కో రుద్రుడు ఆవిష్కృతమవుతాడు. అనంతరం నీటితో మరోసారి అభిషేకించి స్వామివారి మూలమూర్తిని అలంకరించి మంగళహారతిస్తారు. ఆ తర్వాత వివిధ నైవేద్యాలను సమర్పిస్తారు.
స్వామివారికి నీరాజనం అర్పించడంతో లింగోద్భవకాల రుద్రాభిషేకం ముగుస్తుంది. మహాశివరాత్రి నాడు ఉపవాసంతో త్రికరణశుద్ధిగా శివుడిని పూజిస్తే సంవత్సరకాలం నిత్య శివార్చన చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తూ శంకరుడే బ్రహ్మదేవునికి చెప్పినట్లుగా పురాణం చెబుతోంది. మహాశివరాత్రి పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనది. సాధారణంగా అన్ని పండుగలు పగలు జరుపుకుంటే మహాశివరాత్రి మాత్రం రాత్రి పూట జరుపుకుంటారు.