Jambudvipa | మనం సంకల్పంలో చెప్పే జంబూద్వీపం అంటే ఏమిటి?
– వై.శ్రీనివాస్, నేరెడ్మెట్
సంధ్యావందనం, నిత్యపూజలో, వ్రతాలు, నోములు, శుభాశుభ కార్యక్రమాల్లో మన దేశ కాల సమయ సందర్భాలను పేర్కొంటారు. దానినే సంకల్పం అంటారు. ‘అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే..’ అని సాగుతుంది సంకల్ప మంత్రం. ఇందులో ప్రస్తావించిన జంబూద్వీపంలోనే మనదేశం ఉంది. మన పౌరాణికులు ఈ భూ భాగాన్ని ఏడు ద్వీపాలుగా విభజించారు. నాలుగు వైపులా నీళ్లు ఉండి, మధ్యలో ఉన్న భూభాగాన్ని ద్వీపం అంటారు. ఆ ఏడు ద్వీపాలే జంబువు, ప్లక్షం, కుశం, క్రౌంచం, శాకం, శాల్మలం, పుష్కరం. జంబూ అంటే వృక్షాలు (విస్తృతంగా నేరేడు చెట్లు) ఉండే ప్రాంతం అని పేరు. జంబూ ద్వీపాన్ని మళ్లీ తొమ్మిది వర్షాలు (భూ భాగాలు)గా విభజించారు. అవే ఇలావృత (హిమాలయాలు, టిబెట్ ప్రాంతం), భద్ర (హిమాలయాల తూర్పు ప్రాంతం), హరి (అరేబియా- దక్షిణ ప్రాంతం), కేతుమాలం (పశ్చిమం- ఇరాన్, టర్కియే), రమ్యక (ఉత్తరం- రష్యా, సైబీరియా), హిరణ్మయ (ఉత్తరం- మంచూరియా), కురు (ఉత్తరం- మంగోలియా), కింపురుష/ కిన్నర (హిమాలయాల దక్షిణ ప్రాంతం), భరతవర్షం (భారత ఉపఖండం) ఇలా తొమ్మిది భూ భాగాల పేర్లు ప్రస్తావించారు. అందులోని భరతవర్షం అంతర్భాగమే మనం నివసిస్తున్న భారత ఉపఖండం. దీన్నే మన పూర్వికులు భరతఖండం అని పిలుచుకునేవాళ్లు. మేరు నగం, నీలాచలం, హిమాచలం, శ్వేతాచలం, మాల్యవంతం, గంధమాదనం, వింద్యాచలం తదితర పర్వతాలు భరతఖండంలోనివే.
డా॥ శాస్త్రుల రఘుపతి, 73867 58370
సనాతన ధర్మాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు నలుదిక్కులా ఎలా విస్తరింపజేశారు?
Tambulam | ఏ సందర్భాల్లో తాంబూలాలు ఇస్తారు.. వాటి ప్రత్యేకత ఏంటి?