లక్నో: ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణత కోసం ఒక వ్యక్తి రూ.1.5 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. అసలు అభ్యర్థికి బదులు పరీక్ష రాసేందుకు అతడు ప్రయత్నించాడు. అనుమానించిన సిబ్బంది ఆ నకిలీ అభ్యర్థిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. (Solver caught) ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ సంఘటన జరిగింది. జూన్ 3న ఉత్తర ప్రదేశ్ ఎడ్యుకేషన్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ పరీక్షను నిర్వహించారు. బరేలీలోని ఇస్లామియా గర్ల్స్ ఇంటర్ కాలేజీ పరీక్షా కేంద్రంలో ఒక నకిలీ అభ్యర్థిపై సిబ్బందికి అనుమానం కలిగింది. అతడి ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు, బయోమెట్రిక్ డేటాను నిశితంగా పరిశీలించారు. మరో అభ్యర్థి స్థానంలో ఆ వ్యక్తి పరీక్ష రాస్తున్నట్లు నిర్ధారించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
కాగా, ఆ వ్యక్తిని ప్రమోద్ కుమార్గా పోలీసులు గుర్తించారు. అతడ్ని ప్రశ్నించగా విమల్ కుమార్ స్థానంలో పరీక్ష రాయడానికి అంగీకారం చేసుకున్నట్లు తెలిపాడు. దీనికి గాను రూ.1.5 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్లు చెప్పాడు. ఇప్పటికే కొంత డబ్బు అందుకున్నానని, పరీక్షలో ఉత్తీర్ణత తర్వాత మిగిలిన మొత్తం అందుతుందని వివరించాడు.
ఈ నేపథ్యంలో ప్రమోద్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు అభ్యర్థి విమల్ కుమార్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.