పతంజలి మహర్షి కేవలం యోగశాస్త్ర రచయితగానే మనందరికీ తెలుసు. కానీ, ఆయన గురించి తెలుసుకోవలసిన విజ్ఞాన విశేషాలు మరెన్నో ఉన్నాయి. మొట్టమొదటగా వ్యాకరణం రాసిన మేధావి పాణిని. ఆయన రాసిన వ్యాకరణ శాస్ర్తానికి పతంజలి భాష్యం రాశాడు. అది ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. దీంతో విదేశాల నుంచి కూడా ఎందరో శిష్యులు వ్యాకరణ భాష్యం నేర్చుకోవడానికి పతంజలి దగ్గరికి రాసాగారు. మంచి విద్య అందరికీ చెందాలి. ప్రపంచమంతా వ్యాప్తి చెందాలనే సదాశయంతో వారిని శిష్యులుగా స్వీకరించాడు పతంజలి. మొత్తంగా వెయ్యి మంది ఆయన దగ్గర శిష్యులుగా చేరారు. వారిలో చెప్పుకోదగిన శిష్యుడు గౌడపాదుడు.
వెయ్యి మందికి ఒకేసారి పాఠం చెప్పడం, వారితో వల్లె వేయించటం పతంజలికి కష్టమైంది. వేరువేరుగా చెప్పేందుకు సమయం సరిపోవడం లేదు. అందుకని ఆలోచించి ఒక యంత్రాన్ని తానే కనుగొన్నాడు. ఆ యంత్రాన్ని శిష్యుల మధ్య ఉంచి దాని సాయంతో ఒకేసారి పాఠాలు చెప్పి వల్లె వేయించేవాడు. ఆ యంత్రం కారణంగా చివరి వరుసలో కూర్చున్న వారికి కూడా చక్కగా పాఠాలు వినిపించేవి. వారి విద్యాభ్యాసం పూర్తవుతుంది అనగా, ఒకరోజు పతంజలి లేని సమయంలో ఒక కొంటె శిష్యుడు ‘ఏమవుతుందో చూద్దామని ఆ యంత్రాన్ని చేతితో ముట్టుకున్నాడు. అంతే పెద్దగా గోల మొదలైంది. అది విని ఆశ్రమంలో నుంచి పతంజలి పరిగెత్తుకొచ్చాడు. అప్పటికే శిష్యులందరూ నల్లగా మాడిపోయి మరణించి ఉన్నారు. అంతమంది శిష్యులు అన్యాయంగా బలైపోయారని పతంజలి విలపించసాగాడు. అంతలో గౌడపాదుడు బయటినుంచి వస్తూ కనిపించాడు. అతణ్ని చూడగానే ఒక్కడైనా బతికాడని ఆనందం, గురువాజ్ఞ లేకుండా బయటికి వెళ్లాడన్న కోపం రెండూ కలిగాయి పతంజలికి. మరో సమయంలో క్రమశిక్షణ తప్పితే ఘోరంగా శిక్షించేవాడే. కానీ తను నేర్పిన విద్య వృథా పోరాదని, లోకానికి తన భాష్యం అందాలని శాంతించాడు. మరో ఉత్తమ శిష్యుడికి విద్య నేర్పే వరకు ఈ విద్య గౌడపాదుడికి గుర్తుంటుందనీ, ఎవరికైనా నేర్పించగానే మరిచిపోతాడని శపించాడు. గౌడపాదుడు దేశమంతా గాలించి చంద్రశర్మ అనే విద్యార్థికి ఆ విద్యను ధారపోశాడు. తర్వాత బదరీ క్షేత్రానికి వెళ్లి శుక మహర్షి శిష్యుడై వేద, వేదాంత, సాంఖ్య, యోగ శాస్త్ర గ్రంథాలు రచించాడు. గౌడపాదుడి నుంచి విద్య నేర్చిన చంద్రశర్మే గోవిందాచార్యులుగా మారి జగద్గురు ఆది శంకరాచార్యులకు గురువయ్యాడు.
ఇప్పుడు ఏ బృంద కార్యక్రమాలు జరిగినా అందరికీ వినిపించేలా ‘మైక్ సెట్” అనే సాధనాన్ని వాడటం మనం చూస్తున్నాం! అలాంటి యంత్రాన్నే పతంజలి కనుగొన్నాడు. పతంజలి పాఠశాలలో లేని సమయంలోనూ ఆ యంత్ర సాయంతో శిష్యులు పాఠాలు వల్లించేవారు అంటే.. ఆ యంత్రం కేవలం మైక్సెట్ మాత్రమే కాదనీ, టేప్రికార్డర్ వంటి సాధనమై ఉంటుందని ఊహించవచ్చు. ఎవరూ ఆ యంత్రాన్ని తాకరాదని హెచ్చరించాడు పతంజలి. కానీ, ఒక విద్యార్థి ముట్టుకున్నాడు. విద్యుదాఘాతానికి గురయ్యాడు. కానీ, ముట్టుకున్నది ఒక్కడైతే 999 మంది ఎలా మరణించారు? కరెంట్ తగిలి విలవిల్లాడే విద్యార్థిని రక్షించే క్రమంలో మిగతా శిష్యులూ మరణించి ఉంటారు. వేదాల్లోనూ విద్యుత్ ప్రసక్తి ఉంది. అది రెండుతలల నిప్పు. ఒక తలతో వస్తూ మరో తలతో వెళ్ళిపోయే నిప్పు పాము. విద్యుత్తు మేఘాల్లోనూ, వర్ష (నీటి) ధారలలోనూ కూడా పుడుతుందని వేదాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాచీన రుషులకు నేల బొగ్గు, పెట్రోలియం, విద్యుత్ అన్నీ తెలుసని పురాణాల వల్ల తెలుస్తుంది. కానీ, వాటిని ఏనాడు వినియోగించలేదు. కారణం వాటి వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నా, జీవులకు అనారోగ్యం కలుగుతుందని, భయంకర ప్రమాదాలు, ప్రాణనష్టాలు సంభవించొచ్చని వారు గ్రహించారు. అందుకే, వాటిని వదిలేశారు.
(పురాణగాథల్లో సైన్సు అద్భుతాలు గ్రంథం నుంచి)
పోలిశెట్టి బ్రదర్స్,86399 38297