Peddi Piracy | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన తొలి వారాంతంలోనే భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. అయితే సినిమా విజయయాత్ర కొనసాగుతున్న వేళ పైరసీ రూపంలో మరో పెద్ద సమస్య నిర్మాతలకు ఎదురైంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘పెద్ది’ చిత్రం అదే రోజు పలు పైరసీ వెబ్సైట్లలో హై క్వాలిటీ ప్రింట్తో ప్రత్యక్షమవడం సినీ వర్గాలను కలవరపరిచింది. అభిమానులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, కొన్ని అక్రమ వెబ్సైట్లలో సినిమా ఇంకా అందుబాటులో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్త, సినీ అభిమాని బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ‘పెద్ది’ సినిమాను వీక్షించిన ఆయన, సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ వెబ్సైట్లలో కనిపించడం బాధాకరమని పేర్కొన్నారు. సినిమా పైరసీ వల్ల కేవలం నిర్మాతలకు మాత్రమే కాకుండా ప్రభుత్వానికి కూడా భారీ నష్టం వాటిల్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్మాతల పెట్టుబడులు, వేలాది సినీ కార్మికుల ఉపాధి, ప్రభుత్వ పన్ను ఆదాయం అన్నీ దీనివల్ల ప్రభావితమవుతాయని పేర్కొన్నారు.సినిమా పైరసీ వినోదం కాదు.. అది దొంగతనం. ఒక సినిమా వెనుక ఎన్నో మంది కష్టపడతారు. వారి శ్రమను, సృజనాత్మకతను, పెట్టుబడిని అక్రమంగా దోచుకునే చర్యలను సహించకూడదు అని ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ, సంబంధిత విభాగాలు వెంటనే స్పందించి పైరసీ వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ శాఖ, హోం శాఖ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘పెద్ది’ సినిమా కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాదని, దేశంలో ఇప్పటికీ మౌలిక సదుపాయాల కోసం పోరాడుతున్న వేలాది గ్రామాల వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే కథ అని బొలిశెట్టి అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, గుర్తింపు, ప్రాథమిక హక్కుల కోసం ప్రజలు చేసే పోరాటాన్ని ఈ సినిమా చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, బొలిశెట్టి సత్యనారాయణ కొన్ని రోజుల క్రితం చేసిన మరో పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన మనవడు ఆర్యా సినిమా చూసి రామ్ చరణ్ను విలన్లు కొట్టారని బాధపడుతూ, “వాళ్లను వెళ్లి కొట్టాలి” అని పట్టుబట్టాడని ఆయన సరదాగా వెల్లడించారు. మనవడికి ఇచ్చిన మాట ప్రకారం థియేటర్కు వెళ్లి సినిమా చూసానని కూడా చెప్పారు.అయితే పైరసీని వ్యతిరేకిస్తూ చేసిన పోస్టులో సంబంధిత అక్రమ లింక్ను కూడా జత చేయడం పట్ల కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.