తిరుమల : తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో ఈనెల17న ఆణివారా ఆస్థానం సందర్భంగా 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. ఈ సందర్భంగాప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరులకు ఈ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను( VIP Break Darshan) రద్దు చేసినట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో జూలై 13, 16వ తేదిల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపారు. జూలై 17న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసామని పేర్కొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు.టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం అవుతుందని వివరించారు.ఆదివారం స్వామివారిని 90,130 మంది భక్తులు దర్శించుకోగా 38,075 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.13 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.