శ్రీశైలం : శ్రీగిరులు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. శ్రీశైల భ్రమరాంబికా మల్లికుర్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా కనిపించాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, శివస్వాములు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఆలయంలో సాయంత్రం సహస్ర దీపార్చన కనుల పండువలా సాగింది. ప్రధాన ఆలయానికి కుడివైపున ఉన్న దీపాలంకరణ మండపంలో తొలుత స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి ప్రదోషకాలంలో లోక కల్యాణార్థం సంకల్పం పఠించారు. అనంతరం దీపాలను వెలిగించారు. అనంతరం ఆది దంపతులను వెండి రథంపై అధిష్టింప చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మేళతాళాల మధ్య రథోత్సవం వైభవంగా సాగింది.
త్రయోదశి సందర్భంగా ఆలయంలోని నందీశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ప్రదోషకాలంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మహా సంకల్పం పఠించి. గణపతిపూజ చేశారు. ఆ తర్వాత వివిధ రకాలు ఫలోదకాలు, ఉదకం, పంచామృతాలు, భస్మంతో నందీశ్వరునికి అభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నాభిషేకం నిర్వహించారు. వృషభ పురుషసూక్త వేదమంత్రాలతో పుష్పార్చన చేసి నానబెట్టిన శెనగలు నైవేద్యంగా సమర్పించి మంగళహారతులు ఇచ్చారు.
దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన ప్రభాకర్రావు, గుంటూరుకు చెందిన సాయిధీరజ్ ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున విరాళాలు అందజేశారు. సోమవారం ఆలయ పర్యవేక్షకురాలు సాయికుమారికి విరాళాన్ని చెక్కురూపంలో అందజేశారు. దాతలకు భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు.