తిరుమల : రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో తిరుపతి – తిరుమల మధ్య వాహనాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ సమయం పడుతోందని, ఈ ఆలస్యాన్ని తగ్గించేందుకు శనివారం ఉదయం నుంచి లింకు రోడ్డు ద్వారా వాహనాలను అనుమతిస్తామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం అదనపు ఈవో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 1న పైకి వెళ్లే ఘాట్రోడ్డులో చివరి మలుపు వద్ద వర్షానికి భూమి వదులై పెద్ద బండరాళ్లు పడిపోయాయని, ఈ కారణంగా మూడు రోడ్లకు పూర్తిగా నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేశామని, ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్లు క్షుణ్ణంగా అధ్యయనం చేశారని చెప్పారు. ప్రస్తుతం ఒక బండరాయి ఊడిపడేలా ఉండడంతో దాని పటిష్టతను ఐఐటీ నిపుణులు పరిశీలించి ఎలాంటి సమస్య ఉండదని, ట్రాఫిక్ను అనుమతించాలని సూచించారని తెలిపారు. దీంతో కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో వాహనాలను అనుమతించి లింక్ రోడ్డు ద్వారా డౌన్ ఘాట్కు వెళ్లి తిరుమలకు అనుమతిస్తామని వివరించారు. తద్వారా 75 శాతం ఆలస్యాన్ని అధిగమించవచ్చన్నారు.
కొండచరియలు విరిగిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు పూర్తి చేసే విషయంపై ఐఐటీ నిపుణులు, ఇంజినీరింగ్ అధికారులతో టీటీడీ చైర్మన్ శుక్రవారం సమావేశం నిర్వహించారని అదనపు ఈవో తెలిపారు. ఈ పనులు పూర్తి చేసేందుకు నెల సమయం పడుతుందని నిపుణులు చెప్పారని పేర్కొన్నారు. ఇందుకోసం ఎంతో నైపుణ్యం గల ఆఫ్కాన్ సంస్థకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ఆఫ్కాన్ సంస్థకు చెందిన ఒక నిపుణుల బృందం 20 రోజుల్లో డిజైన్ సిద్ధం చేయాలని కోరామని, మరో నిపుణుల బృందం ఘాట్ రోడ్డులో అన్ని బండరాళ్లను పరిశీలించి సర్వే చేసి మరింత బలంగా మార్చేందుకు యాంకరింగ్, ట్రిమ్మింగ్ తదితర పనులు చేపట్టాలని సూచించామని వెల్లడించారు. మొత్తం పనులు 25 రోజుల్లో పూర్తవుతాయని వివరించారు.