TTD | తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో గురువారం సాయంత్రం వసంతోత్సవం కనుల పండువలా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం, సాయంత్రం వాహనసేవల్లో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. దీన్ని ఉపశమనోత్సవం అని కూడా పిలుస్తారు.
వసంతోత్సవంలో భాగంగా చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం చల్లదనం కోసం చందనం జలాన్ని మాడ వీధుల్లో భక్తులు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు ఉత్సాహంగా భక్తులపై వసంతాలు చల్లారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు బాబు స్వామి, సూపరిండెంట్ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్ దాము, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.