శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో శుక్రవారం భ్రామరి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అర్చక పండితులతో పంచామృతాభిషేకం, పుష్పార్చనలు సర్కారీ సేవగా నిర్వహించినట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. అమ్మవారి ప్రాకార మండపంలో గులాబీ, నందివర్ధనం, చామంతి, బంతిపువ్వులతో ప్రత్యేకంగా అలంకరించిన ఊయలలో స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి అష్టోత్తర శతనామావళి పూజలు చేశారు.
పెరుగుతున్న భక్తుల రద్దీ..
కార్తీకమాస వేడుకల్లో శ్రీగిరులకు భక్తుల తాడికి పెరుగుతున్నది. శుక్రవారం సాయంత్రానికి క్షేత్ర పరిధిలో భక్తుల సందడి కనిపించింది. అందులోను స్వామివారి గర్భాలయ స్పర్శదర్శనాలు చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రికులు ముందుగా ఆన్లైన్ www.srisailadevasthanam.org పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో లవన్న కోరారు.