తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం శ్రీ శుభకృత్నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్ధి చేసి శ్రీదేవి ,భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు.
అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్దఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పెర్నివెంకటరామయ్య, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు అధికారులు పాల్గొన్నారు.
తిరుమల శంఖుమిట్ట ప్రాంతంలో పునర్నిర్మించిన జగన్నాథ భవన్ అతిథి గృహాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శనివారం ప్రారంభించారు. హైదరాబాద్ కు చెందిన దాత ప్రమోద్ కుమార్ అగర్వాల్ ఈ అతిథి గృహాన్ని ఆధునిక వసతులతో పునర్నిర్మించారు.