శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఈవో లవన్న దంపతులు, ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణిరెడ్డి భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకొని అర్చక వేదపండితులతో కలిసి స్వామివారి యాగశాల ప్రవేశం చేయడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్థానాచార్యులు లోక కల్యాణం వేదపండితులు, రుత్వికులు శివసంకల్పాన్ని పఠించారు. గణపతిపూజ, అఖండ దీప కలశ స్థాపన, వేదస్వస్థి, పుణ్యాహవాచణం, చండీశ్వరపూజ, రుద్రపారాయణం, రుద్ర కలశ స్థాపన, కంకణపూజ, కంకణధారణ తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భ్రమరాంబ అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చన, చండీహోమాలు నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత ప్రదేశంలోని మట్టిని తీసుకుని తొమ్మిది పాలికల్లో వేసి నవధాన్యాలను అంకురారోపింజేసే క్రతువును ఘనంగా జరిపారు.
ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్పమూర్తులను భృంగివాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు జరిపారు. కన్నడిగుల ఇలవేల్పు భ్రమరాంబ అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో విశేష పూజలు నిర్వహించారు. చతుర్భుజాలు కలిగిన దేవి.. రెండు చేతుల్లో పద్మాలు, కుడివైపు అభయ హస్తం, ఎడమవైపు వరముద్రతో భక్తులకు దర్శనమిచ్చింది. వాహన పూజల అనంతరం స్వామి అమ్మవార్లును ఆలయ ప్రధాన రాజగోపురం ద్వారా గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నందిమండపం నుంచి బయలు వీరభధ్రస్వామి వరకు గ్రామోత్సవం కన్నుల పండగగా సాగింది.
గ్రామోత్సవంలో కోలాటం, జానపద పగటి వేషాలు, బుట్టబొమ్మలు, గొరువ నృత్యం, తప్పెట చిందు, కర్ణాటక జాంజ్, కొమ్మువాయిద్యం, జానపదడోలు, నందికోలుసేవ, కంచుడోలు విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఈవో లవన్నతో పాటు ఈఈ మురళీబాలకృష్ణ, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నర్సింహరెడ్డి, పీఆర్ఓ శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్కుమార్, ఏఈఓలు హరిదాస్, ఫణిధర్ ప్రసాద్, డీఈలు శ్రీనివాస్రెడ్డి, నర్సింహరెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న, ఆలయ పర్యవేక్షకులు శ్రీహరి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.