TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 22న శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి.. అనంతరం శుద్ధి చేయనున్నారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి వారికి, విష్వక్సేనుడు వారికి విశేష సమర్పణ చేయనున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం.. ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు.
తర్వాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం చేయనున్నారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని 22న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 22న ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ క్రమంలో 20, 21 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శకాలకు సంబంధించి ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని తెలిపింది. ఈ మేరకు భక్తులు సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది.