తిరుమల : ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవవలందిస్తున్నందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంగ్లాండ్కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ను అందించింది. శనివారం తిరుమలలో టీటీడీ పాలకమండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డికి ఆ సంస్థ భారత దేశ అధ్యక్షుడు సంతోష్ శుక్లా తరఫున దక్షిణ భారత దేశ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజీ ఈ సర్టిఫికెట్ అందించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందన్నారు.
సాధారణ రోజుల్లో తిరుమలలో 60వేల నుంచి 70వేల మంది భక్తులకు చిన్న పాటి అసౌకర్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు. క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలో జరుగుతోందని చెప్పారు. రోజుకు మూడున్నర లక్షలకుపైగా లడ్డూలు ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారుచేసి భక్తులకు అందిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. కల్యాణకట్టలో రోజుకు 35 వేల నుంచి 45వేల మంది భక్తులు చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంత మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా విజిలెన్స్, సెక్యూరిటీ విభాగం సేవలు అందిస్తోందని చెప్పారు.
ప్రతి రోజు వేలాది మంది భక్తులు అన్న ప్రసాదంలో పరిశుభ్రమైన వాతావరణం మధ్య స్వామివారి అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారని సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల క్షేత్రం పరిశుభ్రత, పచ్చదనానికి పెద్దపీట వేస్తోందన్నారు. భక్తులకు సేవలు అందిస్తున్నందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తిరుమలకు చోటు కల్పించిందని ఆయన చెప్పారు. టీటీడీలో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది అందరూ తాము దేవుడి సేవ చేస్తున్నామనే భక్తిభావంతో కష్టపడి చేస్తున్నారని, ఈ క్రమంలోనే గుర్తింపు వచ్చిందని చైర్మన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు.