తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. జూలై కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18న టీటీడీ (TTD) విడుదల చేయనుంది. బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్లో టికెట్లు కేటాయిస్తారు. వీటిని పొందినవారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
అదేవిధంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 22న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లను 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటా, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లను విడుదల చేయనున్నారు. ఇక, ఈనెల 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు.
అదేవిధంగా 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, ఒంటి గంటకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.