TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను మంగళవారం విడుదల చేయనున్నట్లు తెలిపింది. అక్టోబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం మంగళవారం (జులై 18) ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపింది.
లక్కీడిప్లో టికెట్ల వచ్చిన భక్తులు రుసుము చెల్లించాలని సూచించింది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జులై 21న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనున్నది. అక్టోబరు నెల అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.